ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హనుమంతరావు, వేముల వీరేశం
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు . మైనంపల్లితో పాటు ఆయన కుమారుడు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్లు కూడా కాంగ్రెస్లో చేరారు . వీరికి ఖర్గే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఇటీవల బీఆర్ఎస్ను వీడిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. మైనంపల్లితో పాటు ఆయన కుమారుడు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్లు కూడా కాంగ్రెస్లో చేరారు. వీరికి ఖర్గే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరి వెంట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు థాక్రే వున్నారు. మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేసినట్లుగా ఇప్పటికే రేవంత్ తెలిపిన సంగతి తెలిసిందే.
కాగా.. ఈ నెల 22న బీఆర్ఎస్కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మైనంపల్లి తనతో పాటు తన కుమారుడు రోహిత్కు మెదక్ నుంచి టికెట్ ఆశించారు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్ధుల జాబితాలో మల్కాజిగిరి నుంచి హనుమంతరావుకు టికెట్ కేటాయించగా.. రోహిత్కు మాత్రం నిరాకరించారు.
ఈ పరిణామాలతో మైనంపల్లి హనుమంతరావు రగిలిపోయారు. తన కొడుక్కి టికెట్ రాకుండా చేశారంటూ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిని బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందని, మైనంపల్లి ప్లేస్లో మల్కాజిగిరిలో మరొకరికి ఛాన్స్ ఇస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ అలాంటివేవి చోటు చేసుకోలేదు. మల్కాజిగిరిలో మైనంపల్లి, మెదక్లో రోహిత్ పర్యటిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చివరికి అనుచరులు, కార్యకర్తల సూచన మేరకు మైనంపల్లి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు.