Munugode Bypoll 2022: అభ్యర్థి ఎంపికకు చాలా సమయం ఉంది.. కాంగ్రెస్ నేత దామోదర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు
మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మునుగోడు నుంచి కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరనున్నారు. బీజేపీ నుంచి మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయాలని చూస్తున్న రాజగోపాల్ రెడ్డి.. ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటన చేపట్టారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ నెల 5న మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో ఆ పార్టీ బహిరంగ సభను నిర్వహిచింది.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య సమోధ్యపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ భేటీకి ముందే ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో సీనియర్ నేత జనారెడ్డి భేటీ అయ్యారు. అంతకుముందు జనారెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డితో చర్చలు జరిపారు.
Also Read:Munugode Bypoll 2022: మునుగోడుపై టీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్.. గులాబీ పార్టీ టికెట్ ఆయనకే..?
ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన దామోదర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో అభ్యర్థి ఎంపికకు చాలా సమయం ఉందన్నారు. ఉప ఎన్నికలో విజయం కోసం అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు కసితో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ విజయం సాధించేలా అందరం బాధ్యత తీసుకుంటామని తెలిపారు.