Asianet News TeluguAsianet News Telugu

మునుగోడులో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం:బరిలో 47 మంది అభ్యర్ధులు

మునుగోడు  అసెంబ్లీ స్థానానికి  జరిగే ఉపఎన్నికలో మొత్తం 47  మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  నామినేషన్లు దాఖలు  చేసిన 36 మంది అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

 Munugode bypoll 2022:47 candidates contesting  in  munugode
Author
First Published Oct 17, 2022, 3:38 PM IST

హైద్రాబాద్:మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.ఈ స్థానానికి మొత్తం 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 130 మంది నామినేషన్లు దాఖలు చేశారు.అయితే వీటిలో 83 నామినేషన్లు సరైనవిగా  అధికారులు తేల్చారు.ఈ 83 నామినేషన్లలో  36 మంది తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. దీంతో 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.

ఈ నెల 14 వ తేదీతో  నామినేషన్ల  దాఖలుకు గడువు  ముగిసింది. నామినేషన్ల దాఖలు  చేసిన  తర్వాత  నామినేషన్ల  స్కృూట్నీ నిర్వహించారు . ఆ తర్వాత  నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ  మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది.   ఈ  ఉప ఎన్నికల్లో సుమారు 38 మంది స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్ధులకు  ఇవాళే గుర్తులను  కేటాయించనున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ  తమ ఎన్నికల గుర్తును పోలిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించవద్దని ఈసీని కోరింది.  ఈ విషయమై ఈసీ నుండి స్పందన రాలేదని హైకోర్టులో ఇవాళ లంచ్  మోషన్ పిటిషన్ ను దాఖలు  చేసింది.  ఈ  పిటిషన్ పై  హైకోర్టు రేపు  విచారణ  నిర్వహించనుంది. తాము అభ్యంతరం వ్యక్తం  చేసిన గుర్తులను ఇండిపెండెంట్లకు ఈసీ కేటాయిస్తే టీఆర్ఎస్ ఏ రకంగా స్పందిస్తుందో   చూడాలి.

ప్రధానంగా ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా  పాల్వాయి  స్రవంతి , టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల  ప్రభాకర్  రెడ్డిలు బరిలో ఉన్నారు. బీఎస్పీ, తెలంగాణ  జనసమితి కూడా ఈ  స్థానంలో  పోటీలో ఉన్నారు.

alsoread:మునుగోడు బైపోల్ 2022:చల్మెడ వద్ద కారులో రూ.కోటి స్వాధీనం

మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 8న రాజీనామా  చేశారు.దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. ఈ ఏడాది ఆగస్టు 21న  కోమటిరెడ్డి  రాజగోపాల్  రెడ్డి బీజేపీలో  చేరారు.2018  ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ  అభ్యర్ధిగా తన  అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి  దిగారు.2014 లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  ఈ  స్థానం నుండి గెలుపొందారు.

Follow Us:
Download App:
  • android
  • ios