నీకు చీము, నెత్తురు వుంటే... సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి తీసుకోకు: రసమయిపై మందకృష్ణ వ్యాఖ్యలు
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను నియమించడం పట్ల ఎమార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. పది మంది మాదిగ ఎమ్మెల్యేలు మంత్రి పదవికి పనికిరారా అంటూ ఆయన ప్రశ్నించారు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. నీకు అంత కక్కుర్తి ఎందుకు రసమయి అంటూ ఆయన విరుచుకుపడ్డారు. నీకు చీము.. నెత్తురు వుంటే ఆ పదవి తీసుకోవద్దంటూ మందకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పది మంది మాదిగ ఎమ్మెల్యేలు మంత్రి పదవికి పనికిరారా అంటూ ఆయన ప్రశ్నించారు. మాదిగ ఎమ్మెల్యేలు ఏం ముఖం పెట్టుకుని హుజురాబాద్లో ప్రచారం చేస్తారని మందకృష్ణ నిలదీశారు.
ఎస్సీ అసైన్డ్ భూముల్లో టీఆర్ఎస్ భవనాలు నిర్మించారని ఆయన ఆరోపించారు. మంత్రివర్గ కూర్పు విషయంలో కేసీఆర్ను వెంటాడుతామని మందకృష్ణ హెచ్చరించారు. కత్తి మహేశ్ మరణంతో ఆయనకు శత్రువులు వున్నారని రుజువైందని మందకృష్ణ వ్యాఖ్యానించారు. కత్తి మహేశ్ చనిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కళ్లకు మాత్రమే గాయాలైనప్పుడు ఎలా చనిపోతాడని మందకృష్ణ ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్ డ్రైవర్కు చిన్న గీత పడలేదని ఆయన గుర్తుచేశారు. కత్తి మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.
Also Read:దళిత సాధికారత పేరిట మోసం... సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడు: మందకృష్ణ మాదిగ
కాగా, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రసమయి మూడేళ్ల పాటు ఛైర్మన్గా కొనసాగుతారు. తనను సాంస్కృతిక సారథి చైర్మన్ గా పునర్నియామకం చేయడం పట్ల కృతజ్జతలు తెలుపుతూ, సీఎం కేసీఆర్కు రసమయి బాలకిషన్ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం చేతుల మీదుగా తన నియామక పత్రాన్ని రసమయి అందుకున్నారు.