కవిత మనసు దోచిన నిజామాబాద్ అవ్వ
అవ్వ ఆప్యాయతకు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఫిదా అయ్యారు.
ఆ గ్రామంలో నిజామాబాద్ ఎంపి కవిత కాలుమోపగానే ఒక వృద్దురాలు అందరిని తోసుకుంటూ ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గమనించిన కవిత తనే ఆమెకు దగ్గరగా వెళ్లి కరచాలనం చేశారు. వెంటనే ఆ అవ్వ కవితను గట్టిగా కావలించుకున్నారు. దాదాపు రెండు నిమిషాలపాటు అలాగే ఉండిపోయింది. నా కూతురిలాంటిదానివి...అందరికి అన్నీ చేస్తున్నావు..చల్లాగా ఉండాలంటూ...అన్న ఆ అవ్వ మాటలకు కవిత భావోద్వేగానికి గురయ్యారు. కాసేపయ్యాక ఆమె చేయిపట్టుకుని తనతో పాటే నడిపించుకుంటూ గ్రామంలో పూర్తయిన ఎస్సీ మాల కమ్యూనిటీ హాలును ప్రారంభించారు. ఈ ఘటన నిజామాబాద్ మండలం సిర్పూర్ గ్రామంలో జరిగింది. బుధవారం ఎంపి కవిత నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఆప్యాయతానురాగాలను కవితతో పంచుకున్నారు.
సిర్పూర్లో 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంబించి, ఊళ్ళోకి తిరిగివస్తుండగా,
వికలాంగుడు ఇజ్జని మోహన్ ను చూసి, కారు దిగి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఉత్సాహంగా మహిళలతో బతుకమ్మ ఆడారు.స్కూల్ విద్యార్థులు కవితకు షేక్ హాండ్ ఇచ్చేందుకు పోటీపడ్డారు. విద్యార్థినులతో కవిత సెల్ఫీ తీసుకున్నారు. ఫించను రావడం లేదంటూ చెప్పిన వారి వివరాలు స్వయంగా అడిగి రాసుకుని, ఎమ్మార్వోకు అందజేశారు. మోపాల్ మండలంలో పిఎసిఎస్ షాపింగ్ కాంప్లెక్స్ను ప్రారంభించిన కవిత అక్కడ కూడా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
డిచ్పల్లి మండలం కమలాపూర్లో సబ్ స్టేషన్ను ప్రారంభించిన తరవాత తమ కాలనీకి రావలంటూ పట్టుపట్టిన యూత్ కోరికను కాదనలేక వందలాది మంది ఎదురుచూస్తున్న సభకు ఆలస్యంగా వెళ్లి క్షమించమని కోరడం ప్రజల్లో కవిత పట్ల మరింత గౌరవాన్ని పెంచింది. స్మశానవాటికకు,. కమ్యూనిటీ హాలు నిర్మా ణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతం సభావేదికపైకి రాగానే చిన్న పిల్లలను చూసి ఒక పాపను పైకి పిలిచి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఏం చదువుతున్నావంటూ అడిగారు. అంతకు ముందు 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంబించిన సమయంలో కొందరు బాలికలు సంప్రదాయ దుస్తులలో కోలలు పట్టుకుని వచ్చారు. వారిదగ్గరున్న కోలలు తీసుకుని ఆడారు. ఈ సందర్భంగా బంతిపూలను తనమీద చల్లుతున్న బాలికలపైకి తను కూడా బంతిపూలను చల్లారు. ఈ సరదా సన్నివేశం కమలాపూర్లో జరిగింది.
డిచ్పల్లి మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్లు, ఎంపిటీసీలందరితోనూ మాట్లాడించారు. గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కరించాలని అధికారులను కోరారు. సమావేశం పూర్తయ్యాక చాలామంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఫోటోలు కూడా దిగారు. మొత్తానికి ఎంపి కవిత నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పర్యటన ప్రజలకు సంతోషాన్నిచ్చింది. గ్రామ సమస్యలను వింటూ వ్యక్తిగత సమస్యలనూ పరిష్కరిస్తున్న తీరును చూసిన ప్రజలు, ప్రజాప్రతినిధుల్లో ఎంపి కవిత పట్ల గౌరవంతో పాటు ఆప్యాయతానురాగాలు మరింత పెరిగాయి.