23వ వసంతంలోకి ఉద్యమపార్టీ.. ఎమ్మెల్సీ కవిత ఎమోషనల్ ట్వీట్..
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 23వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విముక్తి కోసం ఆవిర్భవించిన బీఆర్ఎస్.. నేడు భరతమాత బంగారు భవిత కోసం పోరాడుతున్నదని పేర్కొన్నారు.
![Movement party on 23rd spring.. EMC Kavita emotional tweet KRJ Movement party on 23rd spring.. EMC Kavita emotional tweet KRJ](https://static-ai.asianetnews.com/images/01gv2zrcvzsmzbxj98pnk722te/k-kavitha_363x203xt.jpg)
ఉద్యమపార్టీగా అవతరించిన భారత రాష్ట్ర సమితి (గులాబీ పార్టీ) మరో వసంతంలోకి అడుగుపెట్టింది. నేటితో 22 వసంతాలు పూర్తి చేసుకొని.. 23 వ వసంతంలోకి అడుగుపెట్టింది. బీఆర్ఎస్గా మారిన తర్వాత .. తొలి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇవాళ తెలంగాణ భవన్లో ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి, పలు జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ అంశాలపై తీర్మానాలు చేయనున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో..ఎమ్మెల్సీ కవిత ఎమోషనల్ ట్వీట్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పిడికెడు మందితో ప్రారంభమై, ప్రత్యేక రాష్ట్రం సాధించి, తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపి.. నేడు దేశ ప్రగతి కోసం, రైతు రాజ్యం కోసం వడివడిగా అడుగులు వేస్తున్న బి ఆర్ యస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆనాడు..భరతమాత బంగారు భవిత కోసం ఈనాడు..అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆవిర్భవించిన బీఆర్ఎస్.. నేడు భరతమాత బంగారు భవిత కోసం పోరాడుతున్నదన్నారు.