నేనేమిటో చంద్రబాబుకు తెలుసు, జగన్ దే పోరు: మోత్కుపల్లి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ధ్వజమెత్తారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ధ్వజమెత్తారు. టీడీపిలో ఉన్నం త కాలం మానసికంగా తనను చంపేశారని ఆయన వ్యాఖ్యానించారు.
దళితుల ఓట్లు దండుకునేందుకే దళితతేజం కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారని ఆయన శనివారం మీడియా సమావేశంలో ఆరోపించారు. మాల, మాదిగలు చంద్రబాబును నమ్మరని ఆయన అన్నారు.
దళితులకు క్షమాపణ చెప్పిన తర్వాత చంద్రబాబు దళిత తేజం సమావేశంలో పాల్గొనాలని ఆయన అన్నారు. జులై 11వ తేదీన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటాని ఆయన చెప్పారు.
చంద్రబాబును ఓడించాలని శ్రీవారిని మొక్కుకుంటానని చెప్పారు. ముందస్తు ఎన్నికలొస్తే ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు.
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఏపీ సీఎం చంద్రబాబు సర్వనాశనాలకు నిలయంగా మార్చారని ఆయన అన్నారు. తక్కువ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అని మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనా విధానాలను చంద్రబాబు అవమానించారని అన్నారు. దళిత తేజం పేరుతో దళితుల ఓట్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్నారని, దళితులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు.
తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు. ముద్దు కృష్ణమనాయుడిని ముఖ్యమంత్రి అయ్యే వరకు చంద్రబాబు వాడుకున్నారని, కానీ సీఎం అయ్యాక గాలికొదిలేశారని విమర్శించారు. తానేమిటో చంద్రబాబుకు తెలుసునని, దారినపోయే దానయ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, చంద్రబాబుకు గుణపాఠం చెప్పాల్సిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దని కోరుతున్నానని అన్నారు. చంద్రబాబు ముఖం చూసి ఓటేసిన వాళ్లు లేరని అన్నారు.
సీఎం రమేష్లా దీక్ష చేస్తే ఏడాదిపాటు చేయవచ్చునని, 11 రోజులైనా అలసిపోకుండా సీఎం రమేష్ దీక్ష చేస్తున్నాడని, దొంగ దీక్ష చేస్తున్నాడు కాబట్టే.. టీడీపీ ఎంపీలు చులకనగా మాట్లాడారని ఆయన అన్నారు. ఉక్కు రాదు.. తుక్కు రాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కరెక్ట్గా మాట్లాడారని మోత్కుపల్లి సమర్థించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు ఘోరీ కట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు మోసగాళ్లకే మోసగాడని, చంద్రబాబు ఓడిపోతే తనకు అన్ని పదవులు వచ్చినట్లేనని, చంద్రబాబుకు తప్పకుండా దళితుల ఉసురు తగులుతుందన్నారని అన్నారు. హోదా కోసం పోరాడుతోంది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వామపక్షాలు మాత్రమేనని అన్నారు.
తన 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబులాంటి నీచ రాజకీయ నేతలను చూడలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని దివంగత నేత ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని ఆయన గుర్తు చేశారు.
టీడీపీలో చంద్రబాబు కన్నా నేనే సీనియర్ను అని అన్నారు. చంద్రబాబు హృదయం లేదని బండరాయి అని అన్నారు. తాను ఏడిస్తే ఒక్కసారైనా వచ్చి ఓదార్చారా.. అని ప్రశ్నించారు. తనను విజయసాయిరెడ్డి సహా అన్ని పార్టీల వాళ్లు ఓదార్చారని చెప్పారు.