గిరిజనులకు రిజర్వేషన్ల గురించి అడిగితే  తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని, టీఆర్ఎస్‌ నుండి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ రాములు నాయక్ చెప్పారు. 

హైదరాబాద్: గిరిజనులకు రిజర్వేషన్ల గురించి అడిగితే తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని, టీఆర్ఎస్‌ నుండి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ రాములు నాయక్ చెప్పారు. 

టీఆర్ఎస్ నుండి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ రాములు నాయక్ సోమవారం నాడు మధ్యాహ్నం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడారు.నారాయణఖేడ్ టీఆర్‌ఎస్ టిక్కెట్టు దక్కని కారణంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో రాములు నాయక్ సంప్రదింపులు జరిపారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలంలలో ఏదో ఒక సీటునుండి రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం తెలుసుకొన్న టీఆర్ఎస్ నేతలు సోమవారం నాడు రాములు నాయక్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్‌పై రాములు నాయక్ విమర్శలు గుప్పించారు. గిరిజనులకు రిజర్వేషన్లపై తాను కేసీఆర్‌కు ఈ నెల 5వ తేదీన లేఖ రాసినట్టు చెప్పారు.

 కేసీఆర్‌కు లేఖ రాసిన తర్వాత పార్టీ నేతలు తనను కేసీఆర్‌ను కలవకుండా అడ్డుకొన్నారని ఆయన ఆరోపించారు. గిరిజనులకు రిజర్వేషన్ల విషయమై అడిగితే తనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. 

తన లాగే చాలా మంది టీఆర్ఎస్ లో బాధపడేవారు ఉన్నారని ఆయన చెప్పారు.త్వరలో గిరిజన మేథావులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు రాములు నాయక్ ప్రకటించారు.

ఒకానొక దశలో రాములునాయక్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకొన్నారు. టీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదన్నారు. కనీసం షోకాజ్ నోటీసు కూడ ఇవ్వకుండానే తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ ద్రోహులు... ఉద్యమం సమయంలో తెలంగాణ గురించి నోరెత్తని వారంతా ఇవాళ కేసీఆర్ కేబినెట్ లో ఉన్నారని ఆయన విమర్శించారు. గిరిజనులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. గిరిజనులను కేసీఆర్ సర్కార్ చిన్న చూపు చూస్తోందని ఆయన విమర్శించారు.

సంబంధిత వార్తలు

రాములు నాయక్‌ ‌పై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు

టీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ రాములు నాయక్