కేసీఆర్ చెప్పిందే మళ్లీ చెప్పినందుకు ధన్యవాదాలు.. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్..
గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ మాటలకు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు. రిపబ్లిక్ డే వేడుకల్లో మాట్లాడుతూ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం మీద చురకలు వేశారు.
హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజభవన్ లో ఈరోజు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. నిరుడు కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్ భవన్ కే పరిమితమయ్యాయి.. ఆ కార్యక్రమానికి మంత్రులు గాని, కెసిఆర్ గానీ హాజరు కాలేదు. ఈ ఏడాది కూడా అదే పునరావృతం అయింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రమే ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోనే రాజుభవన్లో గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు తెలంగాణ అంటే ఇష్టం.. కొందరికి నేను నచ్చకపోవచ్చు.. కానీ తెలంగాణ ప్రజల కోసం ఎంత కష్టమైనా పని చేస్తా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాజ్యాంగం ప్రకారమే ఏర్పడింది. ఈ రాష్ట్ర అభివృద్ధిలో గవర్నర్ గా నా పాత్ర ఉంటుంది. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. ఆందోళనకర పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. కొందరికే ఫామ్ హౌస్ లు కాదు.. అందరికీ ఫార్మ్ లు కావాలి. రోజుకు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి తెలంగాణలో ఉంది’ అని వ్యాఖ్యానించారు.
రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారాన్ని రేపాయి. మరోసారి ముఖ్యమంత్రి, గవర్నర్ల మధ్య ఉన్న విభేదాలు తెరమీదకి వచ్చాయి. గవర్నర్ ఈ కామెంట్ల మీద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ‘సెంట్రల్ విస్టా కంటే ముందు దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని.. కరోనా లాంటి క్లిష్ట సమయంలోనే కేంద్రాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. రైతులు, కూలీలు, నిరుద్యోగ యువత కోసమే బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టము. రిపబ్లిక్ డే లాంటి ప్రత్యేకమైన రోజు సీఎం కెసిఆర్ ప్రశ్నించిన అంశాలనే గవర్నర్ తమిళసై మళ్లీ అడిగినందుకు ఆమెకు ధన్యవాదాలు’’ అంటూ ట్విట్టర్ వేదికగా అన్నారు.