Asianet News TeluguAsianet News Telugu

MLC Kavitha: కులగణనపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు..

MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన ప్రక్రియను వెంటనే చేపట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీ హక్కుల సాధన కోసం బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.  

MLC Kavitha demands Congress government to commence BC census process immediately KRJ
Author
First Published Feb 7, 2024, 11:06 PM IST

MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కుల గణన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని బీఆర్‌ఎస్ నాయకురాలు, భారత్ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత  డిమాండ్ చేశారు. బీసీ హక్కుల సాధన కోసం బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ కుల గణన ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందన్నారు. 

కుల గణన పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనీ, జనాభా లెక్కల ఆధారంగా ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీసీ కోటాను పెంచడం ద్వారా.. కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నట్లు బిసి వర్గాల నుండి మరో 24 వేల మంది ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యే అవకాశం ఇవ్వవచ్చునని పేర్కొన్నారు.

బ్రిటీష్ హయాంలో 1931లో చివరిసారిగా కులాల గణన జరిగిందని, అప్పుడు దేశంలో 4300కి పైగా బీసీ కులాలున్నాయనీ కవిత గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వాల ప్రకారం దేశంలో వారి సంఖ్య 2400కి తగ్గిందని తెలిపారు. ఐదేళ్లలో బీసీ అభివృద్ధి, సంక్షేమానికి రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ ఏడాది నుంచే బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్ నెరవేరడంతో దళిత సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.

అసెంబ్లీ ఆవరణలో మహాత్మా ఫూలే విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఫూలే జయంతి జరుపుకునే ఏప్రిల్ 17లోగానైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన బీసీ సంఘాల ప్రతినిధులు కూడా మహా ధర్నాలో పాల్గొంటారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios