Medaram Jatara: మేడారం జాతరపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించింది. ఈ క్ర‌మంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై  విరుచుక‌ప‌డ్డారు 

Medaram Jatara: మేడారం జాతరపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించింది. ఈ క్ర‌మంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై విరుచుక‌ప‌డ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నాస్తికుల రాజ్యంగా మారిపోయిందని, యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న తెరాస సర్కారు.. వేములవాడ రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేయ‌డంలో మొండి వైఖ‌రి వ్య‌వ‌హ‌రిస్తోందని, మేడారం జాతర కంటే ముందు రాజన్న ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తోందని, అలాంటిది రాజన్న ఆలయంలో సౌకర్యాలపై పట్టించుకోవడంలేదని బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. 

 బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త‌న‌దైన శైలిలో స్పందించారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ తెలంగాణలోనే ఉండటం మనందరికీ గర్వకారణమ‌నీ క‌విత అన్నారు. ముందు మేడారానికి జాతీయ హోదా తెచ్చి, ప్రత్యేక నిధులు కేటాయించి ఆ తర్వాతే మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు.

స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ మొత్తం ₹ 332.71 కోట్లను విడుదల చేశారనీ, 2014 నుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఒక్క పైసా నిధులు కూడా ఎందుకు విడుదల చేయలేదని ఎంపీ బండి సంజయ్ ను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప‌లుమార్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని కవిత అన్నారు. 

గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10% రిజర్వేషన్ల ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఆమోదించి వెంటనే రిజర్వేషన్లు కల్పించి, మేడారానికి జాతీయ హోదా తెచ్చి , ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ సంజయ్ ను డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. మేడారం జాతరకు జాతీయ హోదా, గిరిజనులకు 10% రిజర్వేషన్లు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సత్యవతి రాథోడ్ రాసిన తాజా లేఖలను జతచేస్తూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.