తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడడం బాధాకరమని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు సమన్వయకర్త మాత్రమేనని అన్నారు. 

తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడడం బాధాకరమని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు సమన్వయకర్త మాత్రమేనని అన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో తాము పనిచేస్తున్నామని చెప్పారు. అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని చెప్పారు. పీసీసీ చీఫ్ ఆయన పరిధి మేరకే పని చేస్తున్నాని అన్నారు. హుజురాబాద్, మునుగోడులకు ఒకే విధంగా చూడలేమని అన్నారు. కోమటిరెడ్డి వెంట్ రెడ్డి, రేవంత్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరో వైపు గాంధీభవన్‌లో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చంపి, బీజేపీని బతికించాలని చూస్తున్నారని ఆరోపించారు. గత మూడేళ్లుగా కాంగ్రెస్‌లోనే ‌ ఉండి పార్టీని చంపాలని అనుకున్నారని.. ఇప్పుడు బయటకు పోయి చంపాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ వాళ్లు ఏం చెపితే రాజగోపాల్ రెడ్డి అది మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని.. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తేనే లాభిస్తుందని బీజేపీ ఆరోపణలు చేయిస్తుందన్నారు. 

దాసోజు శ్రవణ్‌పై ఒత్తిడి తెచ్చి పార్టీ మారేలా చేశారని అన్నారు. బీజేపీ వాళ్ల వల్లే రాజకీయాలు దిగజారి పోయాయని మండిపడ్డారు. దాసోజు శ్రవణ్‌పై వ్యక్తిగతంగా తాను ఎటువంటి కామెంట్స్ చేయడం లేదని అన్నారు. దాసోజ్‌ శ్రవణ్‌ కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారని.. ఆ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు.