తెలంగాణలో రేపే ఎమ్మెల్సీ ఎన్నికలు..
స్థానిక సంస్థల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మరి కొన్ని గంటల్లో ఎన్నికలు మొదలవనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. రేపు 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన ఆరు ఏక్రగ్రీవం అయ్యాయి.
5 ఉమ్మడి జిల్లాల పరిధిలో...
రేపు జరగబోయే ఎన్నికలు ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగనున్నాయి. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, మొదక్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. 37 పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఈ ఎన్నికల్లో మొత్తం 5326 మంది స్థానిక సంస్థల సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉయదం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికలు సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనున్నాయి. 14వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.
ఏకగ్రీవాలకు ప్రయత్నించినా...
దాదాపు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటేనే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దాదాపుగా ఆ పార్టీ అభ్యర్థులే లేదా ఆ పార్టీ సూచించిన అభ్యర్థులే ఎన్నికవుతారు. టీచర్స్, గ్రాడ్యుయేట్ కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రమే కొన్ని సార్లు మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. కానీ గవర్నర్ కోటాలో, ఎమ్మెల్యేల కోటాలో, స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ నుంచే మెజారిటీ సభ్యులు ఎన్నికవుతూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగా అధికార పార్టీ నుంచే స్థానిక సంస్థల సభ్యులు, ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో ఉంటారు. కాబట్టి ఆటోమెటిక్గా పార్టీ సూచించిన అభ్యర్థులకే వారు ఓటు వేస్తారు. అందుకే ఇతర పార్టీ అభ్యర్థులు, బలం లేని అభ్యర్థులు ఈ ఎన్నికలకు దూరంగా ఉంటారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యే కోటాలో జరిగాయి. అందుకే అధికార పార్టీ తప్ప ఇతర పార్టీల నాయకులు ఇందులో పోటీకి దిగలేదు. దీంతో టీఆర్ఎస్ సూచించిన 6గురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అదే దారిలో ఈ స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా టీఆర్ఎస్ ఏకగ్రీవం చేసుకోవాలని చూసింది. ఈ విషయంలో 50 శాతం విజయం సాధించిందని చెప్పవచ్చు. ఎందుకంటే 12 స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టీఆర్ఎస్ 6 స్థానాలను ఏకగ్రీవం చేసుకోగలిగింది. మిగిలిన స్థానాల్లో కూడా ఏకగ్రీవం చేసుకునేందుకు చివరి వరకు ప్రయత్నించింది. అయినా పలువురు పోటీలో నిలవడంతో ప్రస్తుతం ఆ స్థానాల్లో ఎన్నిక అనివార్యం అయ్యింది.
టీఆర్ఎస్ కు రెబల్స్ నుంచే పోటీ..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారిక టీఆర్ఎస్కు పోటీగా నిలిచిన వారు దాదాపు అదే పార్టీకి రెబల్స్గా మారిన వారే. పార్టీ తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, ఇందులో పోటీ చేస్తేనే తమ అంసంతృప్తి అధిష్టానంకు తెలుస్తుందని కొందరు పోటీ చేస్తుంటే.. మరి కొందరు టీఆర్ఎస్ పై కోపంతో పోటీ చేస్తున్నారు.
ఎక్కడి నుంచి ఎందరు పోటీ అంటే.. ?
ఆదిలాబాద్ జిల్లాలో ఒక స్థానం ఖాళీగా ఉంటే అక్కడ ఇద్దరు పోటీలో ఉన్నారు. అలాగే కరీంగనర్లో ఉన్న రెండు స్థానాలకు పది మంది పోటీలో ఉన్నారు. ఖమ్మంలో రెండు స్థానాలకు నలుగురు, నల్గొండలో ఒక స్థానానికి ఏడుగురు పోటీ చేస్తున్నారు. అలాగే మెదక్లో ఒక స్థానానికి ముగ్గరు పోటీలో నిలిచారు. మరి ఇందులో అధికారిక పార్టీకి చెందిన వారు కాకుండా ఇతరులు ఎవరైనా గెలుస్తారా ? లేదా టీఆర్ఎస్ పార్టీయే క్లీన్ స్వీప్ చేసుకుపోతుందా అనే విషయం తెలియాలంటే ఈ నెల 14వ తేదీ వరకు ఎదురుచూడాల్సి ఉంటుంది.