అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అంటున్న సీతక్క కుమారుడు.. ఎక్కడి నుంచి అంటే..?
ములుగు ఎమ్మెల్యే సీతక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాజకీయాల్లో సీతక్క తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సీతక్క కుమారుడు కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాజకీయాల్లో సీతక్క తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ నక్సలైట్ అయిన సీతక్క.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రజాసేవకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె ఏ పార్టీలో ఉన్నప్పటీకి.. పార్టీలకు అతీతంగా సీతక్కను జనం అభిమానిస్తుంటారు. ముఖ్యంగా ములుగు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలలోని ప్రజలతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. తాజాగా ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సీతక్క కుమారుడు సూర్య గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అయితే సీతక్క కొడుకు కూడా గురించి చాలా మందికి తెలియదనే చెప్పాలి. అయితే బయట ఎక్కువగా కనిపించని సూర్య.. తల్లికి సాయం చేస్తుంటారు. ఓ వైపు తల్లి ప్రాతినిధ్యం ములుగులో పార్టీ కోసం పనిచేయడంతో.. తనను తాను నిరూపించుకునేందుకు సిద్దం అవుతున్నారు.
రానున్న ఎన్నికల్లో సీతక్క ములుగు నుంచే మరోసారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగడం దాదావు ఖాయంగా కనిపిస్తుండగా.. ములుగుకు ఆనుకొని ఉన్న పినపాక నుంచి పోటీ చేసేందుకు సూర్య రెడీ అవుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించాన రేగా కాంతారావు.. ఆ తర్వాత బీఆర్ఎస్(అప్పుడు టీఆర్ఎస్)లో చేరిపోయారు. అయితే ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ నుంచి బరిలో నిలవాలని కొందరు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అక్కడ వారికి ఏ మేరకు మద్దతు దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే రేగా కాంతారావు పార్టీ మారినప్పటీ నుంచి సూర్య.. నెమ్మదిగా తన పని కానిచ్చేసుకుంటూ పోతున్నారు. ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజల మధ్యే ఉంటున్నారు. అయితే తాజాగా తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అంటూ ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే పినపాక నుండి బరిలో ఉంటానని చెబుతున్నారు. అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నిజమైన సైనికుడిలా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. పినపాక నియోజకవర్గంలో తనకు చాలా ఫాలోయింగ్ ఉందని.. అక్కడి నుంచి తాను పోటీ చేయించాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారని సూర్య చెబుతున్నారు. కొందరు నేతలు బీఆర్ఎస్లోకి వెళ్లినా పినపాకలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని అన్నారు.
అయితే ఒక కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం కొన్ని నెలల కింద కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరి రాహుల్ గాంధీ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకున్న సీతక్క కుమారుడు సూర్యకు పినపాక సీటు దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.