రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే సీతక్క ఓటు చెల్లలేదు. ఆమె ఓటు వేసే సమయంలో కొంత హడావిడి జరిగింది. దీంతో బ్యాలెట్ పేపర్ లో పలు చోట్ల మార్క్ పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పలు ఆరోపణలు వచ్చాయి. ఆమె ప్రతిపక్షాల అభ్యర్థికి ఓటు వేయలేదని, క్రాస్ ఓటింగ్ జరిగిందని పలువురు వ్యాఖ్యానించారు. దీనిని ఆమె ఖండించారు. అయితే క్రాస్ ఓటింగ్ జరగలేదని గురువారం కౌంటింగ్ ప్రక్రియ అనంతరం స్పష్టం అయ్యింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి క్రాస్ ఓటింగ్ జరగలేదని న్యూ ఢిల్లీలో గురువారం నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం తేలింది. అయితే ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మూడు ఓట్లు వచ్చాయని తెలిసింది. అంటే ఆ ఓట్లు ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు వేశారని స్పష్టం అవుతోంది.
ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ నుంచి 113 ఎమ్మెల్యేల ఓట్లు వచ్చాయి. ఇందులో మొత్తం 101 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. అయితే బ్యాలెట్ పేపర్పై తప్పుగా గుర్తు పెట్టడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. దీంతో సిన్హాకు 114 ఓట్లు రాగా ఒక ఓటు తగ్గి మొత్తంగా 113 ఓట్లే వచ్చాయి.
ఒడిశాలో కలవరపెడుతున్న కలరా.. ఎనిమిదిమంది మృతి..120 మందికి అస్వస్థత..
మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. మొత్తం 103 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 101 మంది ఓటింగ్ రోజు హాజరయ్యారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలందరూ ఓట్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వైపే మొగ్గు చూపగా.. బీజేపీ మాత్రమే ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చింది. కాగా.. భారత రాష్ట్రపతి పదవి నిర్వహించిన ఎన్నికల్లో NDA అభ్యర్ధి ద్రౌపది ముర్ము విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమెకు సగానికి పైగా ఓట్లు పడ్డాయి. దీంతో ఆమె భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 25వ తేదీన జరగనుంది.
ఒడిశా రాష్ట్రానికి చెందిన ద్రౌపది ముర్ము వయస్సు 64 ఏళ్లు. 2000, 2004లలో ఒడిశా అసెంబ్లీకి ఆమె ఎన్నికయ్యారు. నవీన్ పట్నాయక్, బీజేడీ సంకీర్ణ సర్కార్ లో ఆమె 2000 నుండి 2004 వరకు మంత్రిగా పనిచేశారు. 2015లో జార్ఖండ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల కోసం పోలింగ్ నిర్వహించారు. దేశంలోని పలు రాష్ట్రాల శాసనసభల పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాలతో పాటు 31 స్థానాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ హౌస్ లో ఎంపీల కోసం ఓటింగ్ కు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 98.91 శాతం పోలింగ్ నమోదైంది.
వామ్మో.. మళ్లీ స్వైన్ ఫ్లూ కలవరం.. ఉత్తరప్రదేశ్లో పాజిటివ్ కేసు నమోదు
రాష్ట్రపతిగా విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం నాడు శుభాకాంక్షలు తెలిపారు. ముర్ము నివాసానికి వెళ్లిన మోడీ పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,. విపక్ష పార్టీల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. లోక్ సభ స్పీకర్ ఒం బిర్లా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, పలు పార్టీల నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు.
