కాంగ్రెస్ లో డీసీసీ చిచ్చు.. కీలక నేత రాజీనామా
కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుల నియామకం చిచ్చు పెట్టింది. దీని కారణంగా ఓ కీలక నేత పార్టీకి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుల నియామకం చిచ్చు పెట్టింది. దీని కారణంగా ఓ కీలక నేత పార్టీకి రాజీనామా చేశారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్మల్యే వనమా వెంకటేశ్వరరావుని తాజాగా నియమించారు.
కాగా.. ఆ పదవి ఆశించి భంగపడిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
పార్టీ పదవుల్లో ఆదివాసీలకు ప్రాధాన్యమివ్వాలని గతంలోనే పార్టీ అధిష్టానాన్ని కోరినా.. ఫలితం లభించలేదని రేగా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడేవారికి కాకుండా.. పార్టీలు మారేవారికి ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన రాజీనామా పత్రాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపనున్నట్లు వెల్లడించారు. అయితే గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు డీసీసీ పదవికి అవకాశం ఇచ్చారని, ఆతర్వాత ఇచ్చిన లేఖను రద్దుచేశారని, ఇప్పుడు అవకాశం ఉన్నా.. తనకు డీసీసీ పగ్గాలు ఇవ్వలేదని కొందరు నేతలవద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.