మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయి జైల్లో వున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ విడుదలయ్యారు. పీడీ యాక్ట్‌ను బుధవారం తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 

చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్. పీడీ యాక్ట్‌ను బుధవారం తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే 3 నెలల పాటు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదని ఆదేశించింది న్యాయస్థానం. అలాగే ప్రెస్‌మీట్లు , రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని సూచించింది. సభలు, సమావేశాలు , ర్యాలీల్లో పాల్గొనకూడదని ఆదేశించింది. ఆగస్ట్ 25న పీడీ యాక్ట్ కింద జైలుకెళ్లారు రాజాసింగ్. 

ఇక, మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై టి రాజా సింగ్‌ను పోలీసులు ఆగస్టులో అరెస్టు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలోనే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు.. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే రాజాసింగ్‌పై పోలీసుల చర్యలను రద్దు చేయాలని కోరుతూ ఆయన భార్య ఉషా భాయి హైకోర్టు ఆశ్రయించారు. 

ALso Read:ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు.. పలు షరతులు విధించిన హైకోర్టు

రాజా సింగ్‌పై ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ప్రయోగించిన రెండు నెలల తర్వాత.. పిడి యాక్ట్ అడ్వైజరీ బోర్డు హైదరాబాద్ పోలీసుల నిర్ణయాన్ని సమర్థించింది. అడ్వైజరీ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) కార్యదర్శి వీ శేషాద్రి అక్టోబర్ 19న మెమో కూడా జారీ చేశారు.