Asianet News TeluguAsianet News Telugu

రాజా సింగ్‌కు బెయిల్ దొరకడం కష్టమేనా?.. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్..!

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. అయితే తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్‌ నమోదవ్వడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది.

MLA Raja Singh arrested yet again in Hyderabad, Preventive Detention Act invoked
Author
First Published Aug 25, 2022, 5:37 PM IST

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ నమోదు చేసినట్టుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. అయితే తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్‌ నమోదవ్వడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. రాజా సింగ్‌పై పెద్ద సంఖ్యలో క్రిమినల్ కేసులు ఉన్నాయని, రౌడీషీట్ కూడా ఉందని పోలీసులు వెల్లడించారు. ఇక, ఈ రోజు రాజా సింగ్‌ను ఆయన కార్యాలయం వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ సమయంలో పీడీ యాక్ట్‌కు సంబంధించిన నోటీసులు అందించినట్టుగా తెలుస్తోంది. 

అయితే రాజా సింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసిన నేపథ్యంలో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తరుచూ నేరాలకు పాల్పడేవారికి, పేరుమోసిన నేరస్థులను ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచడానికి పోలీసులు పీడీ యాక్ట్‌ను అమలు చేస్తారు. నేరస్థులు సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్నారనే కారణంతో ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. అయితే పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను సంబంధించిన వివరాలను.. పీడీ యాక్ట్ బోర్డు ముందు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పీడీ యాక్ట్ బోర్డు సమావేశం జరుగుతుంది. అయితే ఆ బోర్డు.. పీడీ యాక్ట్‌‌ను నిర్దారిస్తే ఏడాది పాటు జైలులో ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు పీడీ యాక్ట్‌ను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. 

ఇదిలా ఉంటే.. 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. రాజాసింగ్‌పై 18 కమ్యూనల్ కేసులు ఉన్నాయని చెప్పారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో రాజాసింగ్‌పై గతంలోనే రౌడీషీట్ ఉందన్నారు. గత కేసుల ఆధారంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టుగా చెప్పారు. రాజాసింగ్ తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు. మత ఘర్షణలు చోటుచేసుకునేలా రాజాసింగ్ ప్రసంగాలు ఉన్నాయని చెప్పారు. 

ఈ నెల 22న రాజాసింగ్ రెచ్చగొట్టేలా ఓ యూట్యూబ్ చానల్‌‌లో ఓ వీడియో పోస్టు చేశారని సీవీ ఆనంద్ తెలిపారు. ఓ వర్గాన్ని కించపరిచేలా వీడియో పోస్టు చేశారని చెప్పారు. ఆ వీడియో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందన్నారు.  ఈ నెల 23న రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరోసారి వీడియోలు విడుదల చేస్తానని రాజాసింగ్ మీడియాకు ప్రకటించారని చెప్పారు. మత విద్వేషాల ప్రసంగాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిందన్నారు. వీడియో కారణంగానే నిరసనలు, ఉద్రిక్తతలు చోటు చేసుకన్నాయని చెప్పారు. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు. 

ఇక, రాజా సింగ్‌ను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆయనకు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. రాజా సింగ్ అరెస్టు నేప‌థ్యంలో ఆయ‌న నివాసం వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు.

Follow Us:
Download App:
  • android
  • ios