తలసాని క్షమాపణలు చెప్పాలి... మండిపడ్డ జగ్గారెడ్డి
గాంధీభవన్లో జగ్గారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్, సైనికుల పట్ల మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్.. సింగిల్మ్యాన్ షో నడుస్తోందని, మంత్రులు, ఎమ్మెల్యేలంతా డమ్మీలేనన్నారు.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ ఎమ్మల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ‘‘టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు చేస్తూ.. సైనికులు జీతాల కోసం పనిచేస్తారన్న పదం వాడారు. అంటే సరిహద్దుల్లో పని చేసే సైనికులంతా జీతాల కోసమే పనిచేస్తున్నట్టా? ఇది దేశం కోసం పనిచేసే సైనికులను అవమానించడమే’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.
ఉత్తమ్ను, సైనికులను అమమానించినందుకు మంత్రి తలసాని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విహారయాత్రగా దేశ సరిహద్దులకు మంత్రి తలసాని వెళ్లి ఉండొచ్చునని, యుద్ధం కోసం వెళ్లిన చరిత్ర ఆయనకు ఉందా? అని ప్రశ్నించారు. గాంధీభవన్లో జగ్గారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్, సైనికుల పట్ల మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్.. సింగిల్మ్యాన్ షో నడుస్తోందని, మంత్రులు, ఎమ్మెల్యేలంతా డమ్మీలేనన్నారు.
మొక్కుబడి కేబినెట్ సమావేశాలకు హాజరవుతున్న మంత్రులు.. సీఎం మాట్లాడిన దానికి భజన చేసి వెళుతుంటారని, వారికి వ్యక్తిత్వం లేదని విమర్శించారు. ‘‘మంత్రి తలసాని బయట పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటరు. సీఎం ముందు మాట్లాడేంత దమ్ము, ధైర్యం ఆయనకు ఉందా?’’ అని ప్రశ్నించారు.
‘‘ఉత్తమ్కుమార్రెడ్డి యుద్ధ విమానాలకు పైలట్గా పనిచేశారు. చైనా, పాకిస్థాన్ బోర్డర్లలో సేవలందించారు. యుద్ధ విమానం గాలిలో పేలిపోతే పారాచ్యూట్ సహాయంతో బయటపడ్డారు. ఆ సమయంలో ఉత్తమ్ నడుముకు దెబ్బ కూడా తగిలింది. నోరుంది కదా అని తలసాని ఆయన్ను అవమానించేలా మాట్లాడతారా? దీనిపై ప్రజలు ఆలోచన చేయాలి’’ అని జగ్గారెడ్డి అన్నారు.
చనిపోయిన తర్వాత సైనికులకు సెల్యూట్ కొట్టడం కాదని, బతికున్నప్పుడూ గౌరవించాలని చెప్పారు. తలసాని మంత్రిగా కాకుండా పహిల్వాన్లా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
‘‘కాంగ్రెస్ నేతలను బఫూన్లు, జోకర్లు అంటడు. ఈయన ఎప్పుడు ఎవరిని తిడతడో తెలియదు. చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు కేసీఆర్ను బట్టలిప్పి కొడతానన్నడు. పిలవగానే వెళ్లి మంత్రి పదవి తీసుకున్నడు. ఇక్కడ బఫూన్లు, జోకర్లు, బ్రోకర్లు ఎవరు? అంత రోషమే ఉంటే కేసీఆర్ గుమ్మం కూడా తొక్కి ఉండేవాడు కాదు’’ అన్నారు.
ఒకప్పుడు తనను ఎవరెవరు తిట్టారో వారందరినీ టీఆర్ఎ్సలో చేర్చుకుని కేసీఆర్ తన కాళ్ల కింద పెట్టుకున్నారని చెప్పారు. తలసాని తిట్టినందునే ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్.. చెప్పుల కింద వేసుకుని నలుపుతున్నాడన్నారు.