మిస్ వరల్డ్ 2025 పోటీదారులు హైదరాబాద్‌లోని కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్‌ను సందర్శించారు. డాక్టర్ రఘురాం నేతృత్వంలో చేపట్టిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలను వారు ప్రశంసించారు.

Miss World 2025 : ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ & కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ చేపట్టిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఐదు దేశాలకు చెందిన మిస్ వరల్డ్ 2025 పోటీదారులు హైదరాబాద్ లోని కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లోని కేంద్రాలను సందర్శించారు.

ఈ సందర్భంగా కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ బి. భాస్కర్ రావు మాట్లాడుతూ… "ఇన్స్టిట్యూట్ సందర్శించిన మిస్ వరల్డ్ 2025 ప్రతినిధి బృందానికి హృదయపూర్వక స్వాగతం. డాక్టర్ రఘురాం ఏ పని చేపట్టినా 100% విజయవంతంగా పూర్తి చేస్తారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయనను దగ్గరగా గమనించిన నేను దీనికి హామీ ఇవ్వగలను. తన తల్లి, మాతృభూమిపై ఉన్న అచంచలమైన ప్రేమ ఆయనను యూకే నుండి భారతదేశానికి తిరిగి తీసుకువచ్చింది, ఇక్కడ ఆయన అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై పనిచేస్తున్నారు'' అని అన్నారు. 

‘'నేను ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, దేశానికి ఆయన చేస్తున్న అవిశ్రాంత సేవలో మరిన్ని మైలురాళ్ళు సాధించాలని ఆశిస్తున్నాను" అని కిమ్స్ ఛైర్మన్ ఒక ప్రెస్ నోట్‌లో పంచుకున్నారు. 

మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్ మరియు సీఈవో జూలియా మోర్లీ నేతృత్వంలోని మిస్ వరల్డ్ 2025 ప్రతినిధి బృందం ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ & కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్, కిమ్స్ హాస్పిటల్స్ గత 18 సంవత్సరాలుగా చేపట్టిన వివిధ వినూత్న బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలను ప్రశంసించారు. జూలియా మోర్లీ మాట్లాడుతూ, "డాక్టర్ రఘురాం దక్షిణాసియాలోనే మొట్టమొదటి ప్రత్యేకమైన మరియు సమగ్ర బ్రెస్ట్ హెల్త్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయడం ద్వారా అసాధారణ నాయకత్వాన్ని ప్రదర్శించారు. 18 సంవత్సరాలకు పైగా అనేక మంది మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పులు తెచ్చారు'' అన్నారు.