మేం వేసిన రోడ్లపై వేరే పార్టీ నేతలు నడవొద్దు.. చీరలు పంచితే ఓట్లేస్తారా : మిర్యాలగూడ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
నలుగురికి చీరలు పంచిపెట్టే కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు . తాము వేసిన రోడ్లపై ఇతర పార్టీల నేతలెవరూ నడవొద్దని ఆయన హెచ్చరించారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నలుగురికి చీరలు పంచిపెట్టే కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలన్నారు. చీరలే కావాలంటే.. తాను ఇస్తానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము వేసిన రోడ్లపై ఇతర పార్టీల నేతలెవరూ నడవొద్దని, అధికారులు తన చెప్పు చేతల్లోనే వుంటారని.. కార్యకర్తలు ధైర్యంగా వుండాలని భాస్కర్ రావు పేర్కొన్నారు. 30 వేల మెజార్టీతో గెలిచిన తనను, కేసీఆర్ను ఎవరూ విడదీయలేరని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు గత నెలలోనూ నల్లమోతు భాస్కర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నం పెట్టేవారికి సున్నం పెడుతున్నారని నర్సాపూర్ గ్రామస్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది గురించి ఆలోచన చేయాలని అన్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోకూడదని అన్నారు. వేరే పార్టీవాళ్లు ఉంటే కేసీఆర్ వేసిన రోడ్డు నడవద్దని, రైతు బంధు, పెన్షన్ తీసుకోకుండా ఉండాలని అన్నారు.
ALso REad: కేసీఆర్ వేసిన రోడ్డు మీద నడవద్దు.. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు వివాదస్పద వ్యాఖ్యలు
పథకాలన్నీ తీసుకుని నర్సాపూర్ లో డాన్స్ వేస్తాం అని మీరనుకుంటే.. తన సంగతి తెలియదని అన్నారు. అందరిని డ్యాన్స్ చేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. నర్సాపూర్ వల్ల నాకేదో అయిద్దని మీరంతా అనుకుంటున్నారని.. కానీ ఏమి కాదని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తూ ఓట్లు అడుగుతానని చెప్పారు.