బాసర ట్రిపుల్ ఐటీ నెలకొన్న సమస్యలను పరిష్కారించాలని విద్యార్థులు గత కొంతకాలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బాసర ట్రిపుల్ ఐటీ వెళ్లేందుకు మంత్రలు కేటీఆర్, సబితా ఇంద్రా రెడ్డి సిద్దమయ్యారు.
బాసర ట్రిపుల్ ఐటీ నెలకొన్న సమస్యల గురించి కొద్ది నెలల క్రితం విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్వయంగా క్యాంపస్కు వెళ్లి చర్చలు జరిపారు. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించి తరగతులకు హాజరయ్యారు. అయితే ఆ తర్వాత కూడా పలు సమస్యలపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బాసర ట్రిపుల్ఐటీలో పర్యటించారు. ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్పై గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ నాయకులు సైతం బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
అయితే తాజాగా బాసర ట్రిపుల్ ఐటీ వెళ్లేందుకు మంత్రలు కేటీఆర్, సబితా ఇంద్రా రెడ్డి సిద్దమయ్యారు. సోమవారం కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి.. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు వెళ్లనున్నారు. క్యాంపస్లో విద్యార్థులతో మంత్రులు ముఖాముఖి నిర్వహించనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే విద్యార్థులతో కలిసి మంత్రులు భోజనం చేసే అవకాశం ఉంది. అయితే మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రా రెడ్డి నేరుగా క్యాంపస్కు వస్తుండటంతో.. బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
