Omicron : థియేటర్ల మూసివేత, 50 శాతం ఆక్యూపెన్సీపై తలసాని కీలక వ్యాఖ్యలు
టికెట్ ధరలు, బెనిఫిట్ షోల విషయం ప్రభుత్వ పరిశీలనలో వుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రొడ్యూసర్లు ఇబ్బందులు పడొద్దని, అపోహలు నమ్మొద్దని తలసాని పేర్కొన్నారు. థియేటర్ల మూసివేత, 50 శాతం ప్రేక్షకులు అని చెప్పడం అవాస్తవమని మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో (talasani srinivas yadav) టాలీవుడ్ (tollywood) ప్రముఖులు భేటీ అయ్యారు. త్రివిక్రమ్, దిల్రాజు, దానయ్య, రాజమౌళి వంటి ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లపై చర్చించారు. కొన్ని సమస్యలు పెండింగ్లో వున్నాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి తెలిపారు. కొత్త వేరియంట్ వస్తుందని ప్రచారం జరుగుతోందని.. అయితే ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో వుందని దాని గురించి భయపడాల్సింది లేదని తలసాని వారికి భరోసానిచ్చారు.
టికెట్ ధరలు, బెనిఫిట్ షోల విషయం ప్రభుత్వ పరిశీలనలో వుందని మంత్రి తెలిపారు. ప్రొడ్యూసర్లు ఇబ్బందులు పడొద్దని, అపోహలు నమ్మొద్దని తలసాని పేర్కొన్నారు. థియేటర్ల మూసివేత, 50 శాతం ప్రేక్షకులు అని చెప్పడం అవాస్తవమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలని.. కరోనా వల్ల రెండేళ్లుగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోందని మంత్రి అన్నారు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్ వస్తోందని.. అప్రమత్తంగా ఉండాలని దర్శక నిర్మాతలకు చెప్పానని తలసాని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ 2 డోసులు దాదాపు పూర్తి అయ్యిందని మంత్రి చెప్పారు. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయని.. గతంలో పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చించామని , సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా వుంటుందని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
Also Read:టాలీవుడ్ పై ఒమిక్రాన్ ఎఫెక్ట్ ! ఆ చిత్రాలకు నష్టాలు తప్పవా?
మరోవైపు వేరియంట్ విజృంభిస్తే.. చిత్ర సీమపై ఎఫెక్ట్ గట్టిగానే పడుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు. దీంతో టాలీవుడ్ లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పడిప్పుడే టాలీవుడ్ థియేట్రికల్ బిజినెస్ మెరుగుపడుతోందని భావిస్తున్నారు బడా నిర్మాతలు. తాజాగా ఆఖండ సినిమా థియేట్రికల్ హిట్ కొట్టింది. కరోనా తరువాత టాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అఖండ 53 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే.. 54 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్లోకి వెళ్తుంది. దీంతో మిగితా సిని, నిర్మాతలకు ప్రాణం లేచి వచ్చింది. సినిమాలను చూడటానికి థియేటర్లకు వస్తారనే నమ్మకం మొదలైంది. ఈ నెలలోనే పుష్ప, శ్యామ్ సింగరాయ్, గని రిలీజ్ కానున్నాయి. వీటికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం వచ్చింది.
ఒమిక్రాన్ వేరియంట్ పెరుగుతుంటే.. జనాలు థియేటర్లకు రారు. శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ అని.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ వైరస్ ప్రభావం కచ్చితంగా థియేట్రికల్ బిజినెస్ పై పడుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఒక వేళ ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే.. ఈ నెలలో విడుదల కానున్న పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారవచ్చు. ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం మానేశారు. ఓటీటీల హవా పెరగడంతో థియేటర్లో కొత్త సినిమా రిలీజైనా.. ఓటీటీలో చూద్దాంలే అన్నట్లుగా ఉండిపోతున్నారు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగితే.. టాలీవుడ్ కష్టాల్లో పడినట్టే..