ఈ ఏడాది ఘనంగా బోనాల జాతర.. 15 కోట్ల కేటాయింపు, 25న కీలక సమీక్ష: తలసాని
తెలంగాణలో ఈసారి బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నెల 25న సమావేశం నిర్వహించన్నట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలో ఈసారి బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నెల 25న సమావేశం నిర్వహించన్నట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. గోల్కొండ, సికింద్రాబాద్ బోనాలు, తర్వాత లాల్ దర్వాజా బోనాను ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
అయితే కోవిడ్ వల్ల గతేడాది బోనాలను ఘనంగా నిర్వహించలేక పోయామని తలసాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది బోనాల జాతర కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 25న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసిహెచ్ఆర్ డి)లో బోనాల జాతరపై అత్యున్నతస్థాయి సమావేశం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.
Also Read:జూలై 11 నుంచి గోల్కొండ బోనాలు .. ఈసారి భక్తులను అనుమతించే ఛాన్స్..?
ఈ ఏడాది ఆషాడ బోనాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని తలసాని తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామన్నారు. జులై 11 న గోల్కొండ బోనాలు, 25 వ తేదీన సికింద్రాబాద్ బోనాలు, ఆగస్టు 1 వ తేదీన హైదరాబాదు బోనాల ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు.
25వ తేదీన జరిగే సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మలారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ లు అంజని కుమార్, మహేష్ భగవత్, సజ్జనార్, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని మంత్రి తలసాని తెలిపారు.