రోడ్డుపై గిలగిల్లాడుతున్న వ్యక్తిని కాపాడి... మానవత్వాన్ని చాటుకున్న ఆబ్కారీ మంత్రి (వీడియో)
నడిరోడ్డుపై మూర్చ రావడంతో గిలగిల్లాడుతున్న ఓ వ్యక్తికి స్వయంగా తానే సాయం అందించి హాస్పిటల్ కు తరలించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
మహబూబ్ నగర్: మూర్చ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తికి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నడిరోడ్డుపై మూర్చ రావడంతో గిలగిల్లాడుతున్న అతడికి స్వయంగా తానే సాయం అందించి హాస్పిటల్ కు తరలించారు మంత్రి. ఇలా మంత్రిగారి మంచి మనసుకు, మానవత్వానికి నిదర్శంగా నిలిచిన ఘటన మమబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా కోటకద్ర వెళుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఒక వ్యక్తి ఫీడ్స్ తో పడిపోవటాన్ని గమనించారు. దీంతో తన బిజీ షెడ్యూల్ ను కూడా పక్కనపెట్టి సదరు వ్యక్తికి సాయం చేయడానికి తానే కదిలారు మంత్రి. వెంటనే తన వాహనశ్రేణిని అక్కడే నిలిపి ఫిడ్స్ తో గిలగిల్లాడుతున్న వ్యక్తిని కాపాడారు.
వీడియో
తన కారు తాళాలను సదరు రోగి చేతిలో పెట్టి మామూలు స్థితికి వచ్చేలా చేశారు శ్రీనివాస్ గౌడ్. అంతటితో ఆగకుండా అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందేలా చూడాలని తన సెక్యూరిటీ కోసం వచ్చిన పోలీసులను ఆదేశించారు. ఇలా అనారోగ్యానికి గురయిన వ్యక్తిని వాహనంలో తరలించేవరకు అక్కడే వున్నారు మంత్రి.
ఇలా రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు శ్రీనివాస్ గౌడ్. సదరు రోగికి దగ్గరుండి కాపాడటమే కాదు మంచి వైద్యం అందేలా చూడాలంటూ ఆదేశించిన మంత్రిని అక్కడున్నవారు మెచ్చుకోకుండా వుండలేకపోయారు. అధికారిక కార్యక్రమాల కంటే వ్యక్తి ప్రాణాలే ముఖ్యమన్న మంత్రిగారిని మహబూబ్ నగర్ పట్టణవాసులే కాదు యావత్ రాష్ట్రం అభినందించాల్సిందే.