డోర్నకల్‌ నియోజకవర్గం అధికార బీఆర్ఎస్‌లో రాజకీయం వేడెక్కింది. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయ పరిస్థితులు మారాయి.

మహబూబాబాద్: డోర్నకల్‌ నియోజకవర్గం అధికార బీఆర్ఎస్‌లో రాజకీయం వేడెక్కింది. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయ పరిస్థితులు మారాయి. డోర్నకల్‌లో పోటీకి సంబంధించి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌లు చేస్తున్న గులాబీ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాట్లాడుతూ.. సీటు కోసం గుంట నక్కలు కూర్చొని ఉన్నాయని కామెంట్ చేశారు. తాజాగా ఆదివారం డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. డోర్నకల్ నుంచి తనకు పోటీ చేయాలని ఉందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సీఎం కేసీఆర్ ఆదేశిస్తే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున డోర్నకల్ నుంచి పోటీ చేస్తానని సత్యవతి రాథోడ్ చెప్పారు. తన రాజకీయ జీవితం డోర్నకల్ నుంచే ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. సీఎం కేసీఆర్ అవకాశం కల్పిస్తే తప్పకుండా పోటీ చేస్తానని తెలిపారు. అయితే ప్రస్తుతం డోర్నకల్ నుంచి బీఆర్ఎస్‌కే చెందిన రెడ్యా నాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా.. సత్యవతి రాథోడ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

ఇక, సత్యవతి రాథోడ్ గతంలో డోర్నకల్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2014లో బీఆర్ఎస్‌లో చేరిన సత్యవతి రాథోడ్.. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ నుంచి పోటీ చేసి.. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రెడ్యా నాయక్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కొన్ని నెలలకే రెడ్యా నాయక్ గులాబీ గూటికి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన రెడ్యా నాయక్ విజయం సాధించారు. ఇక, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సత్యవతి రాథోడ్.. రాష్ట్ర కేబినెట్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే రెడ్యా నాయక్, సత్యవతి రాథోడ్ మధ్య రాజకీయ వైరం ఉన్న సంగతి బహిరంగమే.