తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలను ప్రారంభించేందుకు ప్రేరణగా నిలిచిన ‘కల్పన’ కుమార్తె చంద్రకళ వివాహానికి  మంత్రి సత్యవతి  రాథోడ్, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. 

గిరిజన బిడ్డ కల్పన ప్రేరణగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకం (kalyana laxmi) 10 లక్షల మంది ఆడపిల్లల జీవితాలలో వెలుగులు నింపిందన్నారు తెలంగాణ గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (satyavathi rathod). కల్పన వల్ల తెలంగాణ వచ్చాక కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభమైందన్నారు. ఆమె కూతురు చంద్రకళ పెళ్లికి లక్షా 116 రూపాయలు ఆర్థిక సాయంగా ఇవ్వడం సీఎం కేసిఆర్ ముందుచూపునకు నిదర్శనమన్నారు. ఈ పెళ్లికి పెద్దలుగా వ్యవహరించి, వివాహం జరిపించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పెద్ది స్వప్న దంపతులకు సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కల్పన బిడ్డ చంద్రకళ పెళ్లికి హాజరైన ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఆరోజు కేసిఆర్ ఉద్యమ నాయకునిగా, జిల్లా బాధ్యులుగా పెద్ది సుదర్శన్ రెడ్డిలు వున్నారని సత్యవతి చెప్పారు. కల్పన పెళ్లి కోసం దాచుకున్న డబ్బు అగ్ని ప్రమాదంలో మాడిపోయాయి అని ఏడుస్తుంటే... చలించిన కేసిఆర్ ఆమె పెళ్లి తానే చేస్తానని చెప్పి, 50 వేల రూపాయల ఇచ్చి, వివాహాం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక కల్పన పడిన బాధ, ఆమె పెళ్లి స్ఫూర్తితో కళ్యాణ లక్ష్మి పథకం పెట్టారుని సత్యవతి రాథోడ్ వెల్లడించారు. మొదట్లో ఈ పథకం కింద 51 వేల రూపాయలు, తరవాత 75 వేల రూపాయలు ఇచ్చి, ఇపుడు లక్షా 116 రూపాయిలు ఇస్తున్నారని సత్యవతి అన్నారు.

ఇప్పటికీ 9 వేల కోట్ల రూపాయలు ఇచ్చి, 10 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చారని ఆమె ప్రశంసించారు. గిరిజన కుటుంబాల్లో నేడు పెళ్లికి ఈ కళ్యాణ లక్ష్మీ ఎంతో ఉపయోగపడుతోందని సత్యవతి చెప్పారు. కళ్యాణ లక్ష్మీతో ఆగకుండా పెళ్లయిన తర్వాత గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కాగానే కేసిఆర్ కిట్ ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. దీంతో పాటు 12వేల రూపాయలు కూడా గర్భిణీ అయిన ఆరు నెలల నుంచి ప్రసవం అయిన మూడు నెలల వరకు ఇస్తున్నారని, ఆడపిల్ల పుడితే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తున్నారని సత్యవతి రాథోడ్ వెల్లడించారు. 

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ పెట్టిన పథకాలు నేడు దేశానికి ఆదర్శంగా మారాయని ఆమె కొనియాడారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే నిధులు ఆడపిల్ల పెళ్లికి ఆలస్యం కావద్దని వీటిని గ్రీన్ ఛానల్ లో పెట్టారని సత్యవతి అన్నారు. మహిళల కష్టం తెలిసిన సీఎం కేసిఆర్ నేడు వారిని అన్ని విధాల ఆదుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసిఆర్ పాలన ఈ 7 ఏళ్లు స్వర్ణ యుగమని ఆమె అభివర్ణించారు. చిన్న వయసులో పెద్ద మనసుతో కల్పన కూతురు చంద్రకళ వివాహం చేస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కల్పన కుటుంబంతో పాటు గిరిజన కుటుంబాల ఆశీస్సులు ఉంటాయన్నారు. 

కల్పన తన పెళ్లి కోసం కేసిఆర్ సాయం చేస్తే తన బిడ్డకు చంద్రశేఖరరావు పేరు వచ్చేలా చంద్రకళ అని పెట్టారు. అదేవిధంగా కొడుకుకు చంద్రహాసన్ అని పెట్టడం గిరిజనుల కృతజ్ణతభావానికి నిదర్శనమని సత్యవతి పేర్కొన్నారు. ఉద్యమ నాయకులుగా కేసిఆర్ చేసిన పెళ్లి…ఆ తర్వాత ఆ పెళ్లి కూతురు బిడ్డ చంద్రకళకు 20 ఏళ్ల తర్వాత వివాహం కావడం, దానికి మేమంతా హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. 

అంతే కాకుండా కేసిఆర్ నాయకత్వంలో మంత్రిగా ఇలా ఎంతోమంది గిరిజన బిడ్డల పెళ్ళిళ్ళు చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమని సత్యవతి రాథోడ్ చెప్పారు. పెళ్లి అనంతరం నూతన వధూవరులు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన సతీమణి స్వప్నలు కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. పెళ్లికి హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్ నూతన వధూవరులకు కొత్త బట్టలు పెట్టి, ఇంటి సామాగ్రి కొనుగోలు కోసం 25 వేల రూపాయలు అందజేశారు.