నిర్మల్లో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభం.. హాజరైన మంత్రలు సబితా, ఇంద్రకరణ్ రెడ్డి
Nirmal: రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్మల్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది. సోమవారం నాడు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ ను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిలు కలిసి ప్రారంభించారు.
State Level Science Fair in Nirmal: రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమం సోమవారం నిర్మల్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఇరువురు మంత్రులు కలిసి సైన్స్ ఫెయిర్ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, గైడ్ టీచర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సైన్స్ ఫెయిర్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 516 మంది విద్యార్థులు, 280 మంది ఇన్స్పైర్ విజేతలు, గైడ్ టీచర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తులో ఎన్నో ఆవిష్కరణలు చేస్తారన్నారు. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి 50 ఎగ్జిబిట్లను పంపుతామని పేర్కొన్నారు. జపాన్, కంబోడియాలోని అంతర్జాతీయ వేదికలలో రాష్ట్ర విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారని తెలిపారు. అంతర్జాతీయంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా రాణించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారని గుర్తుచేశారు. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేపట్టాలని సూచించారు. విద్యావ్యవస్థలో మార్పులు వచ్చి ఉపాధ్యాయులు పర్మినెంట్ విద్యార్థులుగా మారి ఆధునిక పద్ధతుల్లో బోధిస్తున్నారని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వివిధ ప్రదర్శనలతో వచ్చిన విద్యార్థులను అభినందించిన మంత్రి.. అన్ని జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులకు ఈ ప్రాంత ప్రకృతి అందాలను చూపించాలన్నారు. 50వ రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్కు అన్ని ఏర్పాట్లను చేసినందుకు తన సహచరుడు ఇంద్రకరణ్ రెడ్డిని, జిల్లా యంత్రాంగాన్ని ఆమె అభినందించారు.
ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులు వస్తున్నాయనీ, వాటిని ఆదరించి విద్యార్థులు రాణించాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక దశలోనే మెదడుకు పదును పెడితే అద్భుతాలు సృష్టించవచ్చని తెలిపారు. రాష్ట్ర స్థాయి ప్రదర్శనను నిర్మల్లో నిర్వహించడం గర్వకారణమన్నారు. హైదరాబాద్లో కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ లో పాల్గొనే వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన మొత్తం 516 మంది విద్యార్థులు, 280 మంది ఇన్స్పైర్ మనక్ అవార్డుల విజేతలు, వారి గైడ్ టీచర్లు ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. అలాగే, ఎమ్మెల్యేలు జి విట్టల్రెడ్డి, రేఖానాయక్, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, ఆర్జీయూకేటీ-బాసర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ, రీజనల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు.