టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. 317 జీవోపై సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన
జీవో నెం 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 నుంచి 14 వరకు గడువు ఇస్తున్నట్లు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయుల పూర్వపు జిల్లా సర్వీసును పరిగణనలోనికి తీసుకుంటామని ఆమె తెలిపారు.

రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్కు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 317 జీవో ద్వారా బదిలీ అయిన వారి విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది.ఈ మేరకు వారికి అవకాశం ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయుల పూర్వపు జిల్లా సర్వీసును పరిగణనలోనికి తీసుకుంటామని ఆమె తెలిపారు.
ఇప్పటికే ప్రారంభమైన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జీవో నెం 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 నుంచి 14 వరకు గడువు ఇస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే వచ్చిన 59 వేల దరఖాస్తుల స్క్రూటనీ పూర్తయిందని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
Also REad: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు: షెడ్యూల్ విడుదల
కాగా.. ఉపాధ్యాయ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్చలు జరిపింది. రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో బదిలీల విషయమై చర్చించింది. ఉపాధ్యాయ సంఘాల సూచనలు, సలహలు తీసుకుంది. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలిపారు. బదిలీల సమయంలో భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. వేర్వేరు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సైతం గత నెలలో ఆందోళన నిర్వహించారు. గతంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయలేదని ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు.