రైతు బిడ్డకు పిల్లనిచ్చేరోజులు వస్తాయి : మంత్రి పోచారం
కామారెడ్డిలో మంత్రి పోచారం హాట్ కామెంట్స్...
కామారెడ్డి : బిక్కనూర్ మండల కేంద్రంలో రూ. 2.43 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి, విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం స్పీచ్..
స్వంత గ్రామంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తుంది. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఎవరి ఊహకందని, ఊహించని విధంగా పథకాలు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వ్యవసాయం కుదేలయింది. గతంలో రైతు అంటే పిల్లను ఇవ్వలేదు, దానిని తిరగరాయడమే ముఖ్యమంత్రి సంకల్పం. ఆత్మగౌరవంతో బతికే రైతు అప్పుల పాలవ్వకూడదని ముఖ్యమంత్రి గారు రైతుబంధు పథకం క్రింద ఎకరాకు రూ. 8000 అందిస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఆలోచనను అధికారులు గమనించాలి. ప్రభుత్వం మంచి ఆలోచనతో ముందుకెళ్ళుతుంది.
రాజధాని స్థాయిలో తీసుకునే నిర్ణయాలు, విడుదల చేసిన నిధులు క్షేత్ర స్థాయిలోని ప్రజలకు చేరాలి. ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. గ్రామాలలో రికార్డుల సక్రమానికి భూప్రక్షాళనను చేశాం. గతంలో కరంటు కష్టాలు ఉండేవి. కాని దూరదృష్టి కల ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే విద్యుత్తు సమస్య లేకుండా చేశారు. నేడు వ్యవసాయ రంగానికి 24 గంటల కరంటు సరఫరా చేస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ.
గతంలో విత్తనాలు, ఎరువుల కోసం లాఠీచార్జీలు జరిగేవి. కాని నేడు కావలసినన్ని అందుబాటులో ఉన్నాయి. రైతుల కోసం ఉచిత భీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కొన్ని రాష్ట్రాలు, సంస్థలు రూ. 50 తో కేవలం ప్రమాధవశాత్తు మరణానికి మాత్రమే భీమా కల్పిస్తున్నాయి. అయితే ధర ఎక్కువైనా ప్రమాదంతో పాటు సహజ మరణానికి కలిపి రూ.2271 ప్రీమియం చెల్లిస్తున్నాం. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే పది రోజులలోనే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందుతుంది. వచ్చే అగస్టు15 నుండి LIC వారి ప్రీమియం బాండ్ రైతులకు అందిస్తాం. మంజీర, గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాలు వందలాది ప్రాజెక్టులు, బ్యారేజీలు నిర్మించారు.