జాతీయ స్థాయి క్రీడాకారిణికి  మంత్రి పేషీలో  పనిచేసే ఉద్యోగి వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలికి  అసభ్యకరంగా మేసేజ్ లు పంపాడు. 

హైదరాబాద్: జాతీయస్థాయి క్రీడాకారిణికి మంత్రి పేషీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వేధింపులకు పాల్పడ్డాడు.ఈ విషయమై ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.జాతీయ క్రీడాకారిణి అంతర్జాతీయ స్థాయిలో ఇండియా తరపున ఆడాలని భావిస్తుంది.ఈ విషయమై తెలంగాణ మంత్రిని కలిసింది. అయితే క్రీడాకారిణికి సంబంధించిన వివరాలను తన పేషీలో పనిచేసే ఉద్యోగికి అందించారు. ఆమెకు అవసరమైన సహాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే జాతీయ క్రీడాకారిణికి ఆ ఉద్యోగి వేధింపులకు పాల్పడినట్టుగా బాధితురాలి తరపు బంధువు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై మంత్రి పేషీలో పనిచేసే ఉద్యోగితో మాట్లాడిన ఆడియో సంభాషణను ఆ చానెల్ ప్రసారం చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జాతీయ క్రీడాకారిణిని కలవాలి, మాట్లాడాలి , వయసెంత అంటూ సదరు ఉద్యోగి బాధితురాలికి మేసేజ్ లు పంపినట్టుగా ఆమె బంధువు ఉద్యోగికి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు బాధితురాలికి అశ్లీల వీడియోలు పంపిన విషయమై బాధితురాలి బంధువు మంత్రి పేషీలో పనిచేసే ఉద్యోగిని నిలదీసినట్టుగా ఆ కథనం వివరించింది. ఈ విషయమై బాధితురాలి బంధువు మంత్రి దృష్టికి తీసుకు రావడంతో తన పేషీ నుండి ఆ ఉద్యోగిని తప్పించినట్టుగా ఆ కథనం తెలిపింది. చేతనైతే సహయం చేయాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలని బాధితురాలి బంధువు ఆ ఉద్యోగికి సూచించారు.

దీంతో మంత్రి పేషీలో పనిచేసే ఉద్యోగి జాతీయ క్రీడాకారిణికి ఫోన్ చేసి కాళ్ల బేరానికి వచ్చినట్టుగా ఆ కథనం తెలిపింది. ఈ విషయమై మీడియా వరకు వెళ్తే తన కుటుంబం పరువు పోతోందని సదరు ఉద్యోగి బాధితురాలి బంధువును వేడుకున్నాడు. ఈ విషయమై బాధితురాలికి ఫోన్ చేసి బయటకు ఈ విషయం చెప్పొద్దని ఆ ఉద్యోగి వేడుకున్నాడని ఆ కథనం తెలిపింది.