రాజస్తాన్లో 100 ఏళ్లకు పైబడిన కాళ్లకు పెట్టుకున్న వెండి కడియాలను చోరీ చేయాలని కొందరు దొంగలు ప్లాన్ వేశారు. ఆ వెండి కడియాలను దొంగిలించడానికి ఏకంగా ఆమె కాళ్లనే నరికేశారు.
జైపూర్: రాజస్తాన్లో దారుణం జరిగింది. కొందరు దుండగులు ఓ వృద్ధురాలి కడియాలు దొంగిలించడానికి ఆమె కాళ్లే నరికేశారు. కాళ్లు నరికి ఆ కడియాలు పట్టుకుని స్పాట్ నుంచి పరారయ్యారు. ఈ ఘటన జైపూర్లో ఆదివారం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. గాల్టా గేట్ ఏరియాల తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు.
108 ఏళ్ల జమునా దేవి మీనా కాలనీలో నివసిస్తున్నారు. కూతురు, మనవరాలితో ఆమె జీవిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, తెల్లవారు జామున దొంగలు ఆ వృద్ధురాలిని ఇంటి నుంచి బయటకు లాక్కెళ్లారు. ఆమె ధరించిన వెండి కడియాలు చోరీ చేయడానికి ఏకంగా ఆమె పాదాలను నరికేశారు. పదునైన ఆయుధంతో పాదాలను నరికేశారు. ఆమె ధరించిన వెండి కడియాలను చోరీ చేశారు. వాటిని చేతపట్టుకుని స్పాట్ నుంచి పరారైనట్టు గాల్టా గేట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్హెచ్వో) ముకేశ్ కుమార్ ఖార్డియా తెలిపారు.
ఆ మహిళకు చికిత్స అందించడానికి వేగంగా హాస్పిటల్కు తరలించినట్టు ఆయన వివరించారు.
ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో తాము కొన్ని ఆధారాలను సేకరించినట్టు ఎస్హెచ్వో తెలిపారు. ఆ ఏరియాలోని సీసీటీవీ ఫుటేజీని సేకరించామని, వాటి ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సవాయి మాన్ సింగ్ హాస్పిటల్లో గాయపడిన ఆ మహిళ చికిత్స పొందుతున్నట్టు వివరించారు.