ఆర్టీసీని లాభాల బాటల్లోకి తీసుకెళ్తాం: మంత్రి మహేందర్ రెడ్డి
:ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలను తీసుకొంటున్నట్టు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్:ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలను తీసుకొంటున్నట్టు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి చెప్పారు. ఆర్టీసిని లాభాల్లోకి తెచ్చేందుకు ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై ఆర్టీసిని లాభాల్లోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుందని ఆయన చెప్పారు.
మంగళవారం నాడు హైద్రాబాద్ బస్ భవన్లో రవాణ రంగ నిపుణుల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మంత్రి మహేందర్ రెడ్డితో పాటు ఆర్టీసీ ఛైర్మెన్ సోమారపు సత్యనారాయణ, టీఎంయూ నేతలు బృహస్ ముంబై ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ మాజీ ఛైర్మెన్ నాగరాజు యాదవ్, సీఐఆర్టీ మాజీ ఫ్యాకల్టీ హనుమంతరావు, కర్ణాటక ఆర్టీసీ మాజీ ఈడీ ఆనందరావు, ఆస్ట్రియాలో కన్సల్టింగ్ నిపుణుడు ఆంటోనికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసిని లాభాల బాటల్లోకి తీసుకెళ్లేందుకు నిపుణుల సూచనలను ఎప్పటికప్పుడు కేబినెట్ సబ్ కమిటీ చర్చించనున్నట్టు మంత్రి చెప్పారు. ఆర్టీసీలో సమూల మార్పులను చేసేందుకు కూడ అధ్యయనం చేస్తున్నామని మంత్రి ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో పలువురికి ఆర్టీసీ ఇస్తున్న రాయితీలు ఎలా ఉన్నాయి.. ఇతర రాష్ట్రాల్లో రవాణా సంస్థలు ఎవరెవరికీ ఏ మేరకు రాయితీలు ఇస్తున్నాయనే విషయమై అధ్యయనం చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు.
అంతర్గత పనిని మెరుగుపర్చుకొంటూనే వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కమిటీ చేసిన సూచనలను పాటిస్తామని మంత్రి చెప్పారు. ఖర్చు తగ్గించుకోవడం కోసం టెక్నాలజీని కూడ ఉపయోగించుకొంటామన్నారు.
ఉద్యోగుల వేతనాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు ఏమున్నా ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా తాము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. లాభనష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉన్న తరుణంలో ఈ కమిటీ ద్వారా అనేక సూచనలను స్వీకరిస్తామని టీఎంయూ నేత ఆశ్వథ్తామ రెడ్డి చెప్పారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. గుర్తింపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ సంఘం సిద్దంగా ఉందన్నారు.