బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆమెకు అండగా వుండేందుకు మంత్రి ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రేపు కవితను ఈడీ విచారించనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు తన సోదరి కవిత కోసం మంత్రి కేటీఆర్ ఢిల్లీ బయల్దేరారు. రేపు, ఎల్లుండి కేటీఆర్ ఢిల్లీలోనే వుండనున్నారు. ఢిల్లీలో న్యాయ నిపుణులతో ఆయన భేటీ కానున్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై ఆయన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సంయుక్త సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత మంచి పనిచేసినా బద్నాం చేస్తారని.. ప్రజల కోసం కడుపు కొట్టుకుని పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. రేపు కవితను అరెస్ట్ చేసే అవకాశం వుందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అరెస్ట్ చేసుకుంటే చేసుకోని.. అందరినీ వేధిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. భయపడేది లేదు.. పోరాటం ఆపేది లేదు, వచ్చే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామన్నారు. బీజేపీలో చేరని వారిని వేధిస్తున్నారని.. కవితను కూడా చేరమన్నారని సీఎం పేర్కొన్నారు. మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారని కేసీఆర్ దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో బలం లేకే నేతలపై పడ్డారని.. చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి బలమే లేదని, కనీసం డిపాజిట్లు కూడా రావని సీఎం వ్యాఖ్యానించారు
