అడ్డంగా దొరికినా దొంగలు మొరుగుతారు.. మీరు తొందరపడొద్దు : టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నేపథ్యంలో తొందరపడొద్దని టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారని, వీటిని పార్టీ శ్రేణులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి ట్వీట్ చేశా
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో వుందని .. టీఆర్ఎస్ నేతలు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారని, వీటిని పార్టీ శ్రేణులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు ఘటన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు దిగడం, బీజేపీ కూడా నిరసనలకు దిగడంతో తెలంగాణ ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇకపోతే.. నిన్నటి బేరసారాల ఘటన నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్లోనే వున్నారు. వారితో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా అక్కడే మకాం వేశారు. జాతీయ స్థాయిలో బీజేపీ తీరును ఎండగట్టే విషయమై కేసీఆర్.. వీరి నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారంలో ముగ్గురిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీకి చెందిన సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి(ఏ1), హైదరాబాద్కు చెందిన నందకిషోర్ (ఏ2), తిరుపతికి చెందిన సింహాయాజి (ఏ3)పై కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ ఏసిపి తెలిపారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో కీలక అంశాలను పోలీసులు పొందుపరిచారు.
Also Read:బీజేపీ ట్రాప్ చేయడానికి ప్రయత్నించిన నలుగురు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం...
బిజెపిలో చేరితే రూ.100 కోట్లు ఇప్పిస్తామని సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి ఆఫర్ చేశారని.. నందకిషోర్ మధ్యవర్తిత్వంతో ఫామ్ హౌస్ కు సతీష్ శర్మ, సింహాయాజి వచ్చారని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. టిఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపి లో చేరితే రూ.100 కోట్లు ఇస్తామని బిజెపి తరఫున వారు హామీ ఇచ్చినట్లు పైలట్ రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.
ఆ పార్టీలో చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లు ఆయన పేర్కొన్నట్లు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. బీజేపీ లో చేరితే సెంట్రల్ సివిల్ కాంట్రాక్టర్ తో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పిన విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు. తనకు రూ.100కోట్లు, తనతో ఆ పార్టీలో చేరే వారికి రూ.50కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లు రోహిత్ రెడ్డి తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.