ఏపీలో తీసిన ఫోటో.. తెలంగాణ అంటూ మంత్రి కేటీఆర్ పొరపాటు..!
ఏపీలో వైద్య సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి రైతులకు, రైతు కూలీలకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్న ఫొటోను పోస్ట్ చేసి, అది తెలంగాణలో జరిగినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి పొరపాటు చేశారు. ఇటీవల సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేశామంటూ ఆయన ట్వీట్ చేసి.. ఆ తర్వాత అది తప్పు అని తన ట్వీట్ ని సరిచేసుకున్నారు. ఈ సంఘటన మరవకముందే ఆయన మరో పొరపాటు చేయడం గమనార్హం.
ఏపీలో వైద్య సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి రైతులకు, రైతు కూలీలకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్న ఫొటోను పోస్ట్ చేసి, అది తెలంగాణలో జరిగినట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ ఆరోగ్య సిబ్బంది అంకితభావానికి ఇది నిదర్శనమని తెలిపారు.
ఆయన పోస్టుని కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. అయితే కేటీఆర్ పోస్ట్ చేసిన ఫొటోల్లో ఒకటి ఏపీలోని విజయనగరం జిల్లాలో వ్యాక్సినేషన్కు సంబంధించినదని తెలుపుతూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ట్విటర్లో వివరాలు వెల్లడించారు. అయితే.. కొందరు ఆ ఫోటోలు తెలంగాణవి అంటుండగా.. కొందరు ఏపీలోవి అంటూ ట్విట్టర్ లో వాదించుకోవడం గమనార్హం.
పవన్ అనే వ్యక్తి దీనిని ఈ నెల 12న పోస్ట్ చేసినట్లుగా పేర్కొన్నారు. ‘‘కొడుకు మినిస్టర్ స్టిల్ ఇన్ అదర్ వరల్డ్’’ అంటూ ట్విటర్లో ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసినందుకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. పొలాల్లో పారాల్సిన నీరు.. పేదల కంటి వెంట జాలువారుతుంటే.. పరిహారం ఇవ్వాల్సిన పాలకుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే యువ రైతు రాజేశ్ ఆత్మహత్యలో నేరగాడు కేసీఆర్ కాదా? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.