త్వరలోనే వీఆర్ఏల సమస్యకు పరిష్కారం చూపుతాం: కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్తో నేడు వీఆర్ఏ ప్రతినిధుల బృందం సమావేశం అయింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలో గత కొద్దిరోజులుగా వీఆర్ఏలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. పే స్కేల్ అమలు, అర్హులైన వారికి ప్రమోషన్లు తదితర డిమాండ్లతో వీఆర్ఏలు సమ్మెకు దిగారు. అయితే ఇటీవల వీఆర్ఏలతో మాట్లాడిన కేటీఆర్.. వారి డిమాండ్లు, సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని చెప్పారు. ఈ నెల 20వ తేదీన వీఆర్ఏల బృందం చర్చలకు రావాల్సిందిగా చెప్పారు. ఈ క్రమంలోనే వీఆర్ఏల ప్రతినిధి బృందంతో నేడు కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వీఆర్ఏలకు ఇచ్చిన హామీల అమలుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. త్వరలోనే వీఆర్ఏల సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ప్రభుత్వం, వీఆర్ఏలు వేర్వేరు కాదని పేర్కొన్నారు. వీఆర్ఏలో ఆందోళనలు విరమించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇక, తమ సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్కు వీఆర్ఏ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని మంత్రిని కోరినట్టుగా తెలిపారు. వీఆర్ఏల సమస్య 25 వేల కుటుంబాలతో ముడిపడి ఉందని చెప్పారు.