ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌కు (sonu sood) మద్దతుగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే అతనిపై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌కు (sonu sood) మద్దతుగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్‌ఐసీసీలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన కోవిడ్ వారియర్స్ సన్మాన కార్యక్రమంలోనే మంత్రి కేటీఆర్, సోనూసూద్, జయేశ్ రంజన్ పాల్గొన్నారు. కోవిడ్ వారియర్స్‌కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోనూసూద్.. కేటీఆర్ లాంటి నాయకుడు ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఉండదని అన్నారు. కోవిడ్ వల్ల ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని.. అలాంటి బాధితులకు సాయం చేయడమే మన ముందున్న సవాలు అని సోనుసూద్ తెలిపారు. కోవిడ్ వారియర్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కోవిడ్ సమయంలో చాలా మంది కష్టపడి స్పూర్తిని నింపారని కొనియాడారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. సోనూసూద్‌కు మద్దతుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనుసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే అతనిపై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే సోనూసూద్‌పై ఐటీ, ఈడీ దాడులు చేయించారని ఆరోపించారు. ఇలాంటి వాటిని సోనూసూద్ బయపడాల్సిన అవసరం లేదన్నారు. సోనూసూద్ వెంట తాము ఉంటామని వెల్లడించారు.

Also read: కరీంనగర్: మృత్యువును జయించిన ఆ నలుగురు... ఒకేసారి యాక్సిడెంట్, అగ్నిప్రమాదం చుట్టుముట్టినా

కోవిడ్ కష్టకాలంలో సోనూసూద్ సేవాభావం చాటుకున్నారని గుర్తుచేశారు. తన సేవ, పనితో ప్రపంచం దృష్టినే ఆకర్షించారని అన్నారు. విపత్తు సమయాల్లో ప్రభుత్వమే అన్ని చేయలేదని.. స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతో అవసరం అని అన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేయడం చాలా సులవని.. కానీ బాధ్యతగా సేవ చేయడమే గొప్ప అని వ్యాఖ్యానించారు. 

Also read: ‘‘నన్నే ఆపుతావారా?’’...సీఐపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు...

‘మనం ఏదైనా మంచి పని మొదలుపెడితే.. పేరు కోసం, కీర్తి కోసం చేస్తున్నాడని తొలుత బద్నాం చేస్తారు. వేరే ఆలోచనలు ఉన్నాయి.. రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాడు, ఏదో పదవి కావాలని అనుకుంటున్నాడని అంటారు. ఆ తర్వాత విమర్శలు చేస్తారు. అది కూడా విఫలం అయిన తర్వాత క్యారెక్టర్ కించపరడచం మొదలుపెడతారు. ఇది ఎవరికో కాదు.. సోనూసూద్‌‌కు కూడా జరిగింది. అయినా ప్రయత్నం ఏదో ఆయన చేసుకుంటూ.. కష్టపడి ప్రజలకు సేవ చేస్తుంటే.. ఐటీ దాడులు, ఈడీ దాడులు చేశారు. ఎందుకంటే భయపడుతున్నారు.. ఆయన రాజకీయాల్లోకి వస్తే వాళ్లకెక్కడ నష్టమోనని రకరకాల దాడులు చేస్తున్నారు. సోనూ రియల్ హీరో. ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. మేము నీ వెంట ఉంటాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేటీఆర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.