మందు పోయించను.. పైసలు పంచను.. ఓడిపోతే.. : మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ప్రతిపక్షాలు ఓట్లు అడగడానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పి వారిని నిలదీయండి అని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలు ఓట్లు అడగడానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పి వారిని నిలదీయండి అని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. 50 ఏళ్లు చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని నిలదీయాలని కోరారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రజలు చైతన్యం ప్రదర్శించాలని అన్నారు.సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా మారిందని అన్నారు. పనిచేసే ప్రభుత్వాలను ప్రజలు కాపాడుకోవాలని కోరారు. బీసీ బంధు పథకంలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల దయ ఉంటే తాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని అన్నారు.
ఓట్ల కోసం తన జీవితంలో మందు పోయలేదని.. పైసలు పంచలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా మందు పోయించను.. పైసలు పంచనని అన్నారు. ఒకవేళ ఒడిపోతే.. ఎలాగైనా ప్రజలకు సేవ చేసుకుంటూనే ఇంట్లో కూర్చుంటానని అన్నారు. మందు పోయించి.. పైసలు పంచే చిల్లర రాజకీయం చేయనని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రానికి డోకా లేదని చెప్పారు. సిరిసిల్లలో మెడికల్ కాలేజ్లో సెప్టెంబర్లో ప్రారంభిస్తామని తెలిపారు.
అట్టడుగు వర్గాల పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని.. బీసీ, ఎంబీసీల్లోని 14 కులవృత్తులు చేసుకునేవారికి రూ. లక్ష సాయం అందిస్తున్నామని తెలిపారు. గృహలక్ష్మి పథకం రూ. 3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాం అని కేటీఆర్ తెలిపారు.