టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్లపై సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. ఒకరు మెదడు లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్లపై సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. మంగళవారం సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కాలి గోటికి సరిపోయే నాయకులు తెలంగాణలో ఎవరూ లేరన్నారు. ఈ క్రమంలో ఒకరు మెదడు లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పటికీ తమ పార్టీ డీఎన్ఏ మారలేదన్నారు.
తమ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు వున్నారని.. దేశమంతా తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్గా రూపాంతరం చెందిందని కేటీఆర్ తెలిపారు. జెండా, గుర్తు మారలేదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తాము పనిచేయడం తమ పూర్వ జన్మ సుకృతమన్నారు. దేశ జనాభాలో 3 శాతం వున్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వచ్చాయని.. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఆదర్శవంతంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. పల్లెప్రగతి కారణంగానే ఇదంతా సాధ్యమైందని మంత్రి తెలిపారు.
అంతకుముందు మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. కేసీఆర్ ను తిట్టడం కొందరు నాయకులకు ఫ్యాషన్ గా మారిందన్నారు. కేసీఆర్ను తిడితే పెద్ద నాయకులు అవుతామనే భ్రమలో ఉన్నారని విపక్షాలపై హరీష్ రావు విమర్శలు చేశారు. తెలంగాణపై కేసీఆర్ కు ఉన్న ప్రేమ మోడీకి ఉండదన్నారు. అదరగొడితే బెదరగొడితే భయపడే నాయకుడు కేసీఆర్ కాదన్నారు. కేసులకు కేసీఆర్ భయపడేది లేదన్నారు. ప్రశ్నిస్తే ఈడీ, ఐటీ కేసులు పెడుతున్నారని ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
ALso Read: కేసు క్లోజ్: గవర్నర్ తమిళిసైని తప్పు పట్టిన సుప్రీం
తాను అనుకన్న లక్ష్యం వైపునకు కేసీఆర్ ముందుకు వెళ్లాడన్నారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలతో పోరాడిన చరిత్ర కేసీఆర్దని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణకు దారి దీపమని ఆయన పేర్కొన్నారు. దేశానికి కేసీఆర్ మార్గదర్శి అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సిద్దిపేటకు మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. . త్వరలో రైలు కూడా వస్తుందని హరీష్ రావు చెప్పారు. ప్రతి ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ పథకాలు అందుతున్నాయన్నారు.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతోనే రాష్ట్రంలో ధాన్యం విస్తీర్ణం పెరిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, పథకాలను కేంద్ర మంత్రులు ఎన్నోసార్లు ప్రశంసించారని హరీశ్ రావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైతు బంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ నిధిని కేంద్రం అమలు చేస్తుందన్నారు. ఈ నెల 30న అద్భుతమైన సచివాలయ భవనం ప్రారంభించుకుంటున్నామని ఆయన తెలిపారు.
