ఎన్టీఆర్ పేరు ఉన్నందుకే నేను రెండు సార్లు మంత్రినయ్యా: కేటీఆర్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తారక రామరావు పేరులోనే పవర్ ఉందని అన్నారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన ఎన్టీఆర్ పార్కును మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. అలాగే లకారం సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తారక రామరావు పేరులోనే పవర్ ఉందని అన్నారు. ఎన్టీఆర్ పేరు ఉన్నందుకే తాను రెండు సార్లు మంత్రిని అయ్యానని చెప్పారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ఎన్టీఆర్ ఆదర్శమని చెప్పారు. భారతదేశంలో తెలుగువారు ఉన్నారని చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. అందులో రెండో ఆలోచన లేదని అన్నారు. అలాగే తెలంగాణకు అస్థిత్వం ఉందని చూపించింది కేసీఆర్ అని అన్నారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ.. చరిత్రలో మహనీయుల స్థానం పదిలంగా ఉంటుందని చెప్పారు. ‘‘రాముడు ఎలా ఉంటాడో తెలీదు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు.. మాకు రాముడైన, కృష్ణుడైన ఎన్టీఆరే’’ అని అన్నారు.
ఎన్టీఆర్ పదవులకు వన్నె తెచ్చారని అన్నారు. ప్రజల్లో ఆయనకు ఉన్న పాపులారిటీ ముందు.. ఆయన అలకరించిన సీఎం పదవి చిన్నదని చెప్పుకొచ్చారు. తారక రాముడు ఆశీస్సులతో.. కేసీఆర్ ఆయన శిష్యుడిగా కేసీఆర్ రాజకీయ ప్రస్తానం ప్రారంభించారని అన్నారు. ఎన్టీఆర్ ఎన్నో శిఖరాలు అధిరోహించారని.. అయితే సీఎంగా హ్యాట్రిక్ కొట్టలేదని.. ఆయన వదిలిపెట్టిన పనిని కేసీఆర్ పూర్తి చేస్తారని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఏ సీఎం కూడా హ్యాటిక్ర్ కొట్టలేదని.. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా కేసీఆర్ హ్యాటిక్ కొడితే.. ఎన్టీఆర్ ఆత్మ కూడా శాంతిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.