హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడింది. శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. దీని కారణంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ మరింత పెరగనుంది.
హైదరాబాద్లో శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. పరిశ్రమల మంత్రిగా తాను చాలా దేశాలు, నగరాలు తిరుగుతూ వుంటానని అన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడికి వచ్చినప్పుడు భారతదేశంలో హైదరాబాద్లో వున్న స్థాయిలో ఏ నగరంలోనూ మౌలిక వసతులు లేవన్నారు. ఈ విషయాన్ని అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
పరిశ్రమలు, ఐటీ రంగం విస్తరిస్తూ వుండటంతో ప్రతి ఏటా లక్షలాది మంది హైదరాబాద్కు కొత్తగా వస్తున్నారని మంత్రి చెప్పారు. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గాను లింక్ రోడ్స్ నిర్మాణం చేపట్టినట్లు కేటీఆర్ చెప్పారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో వుంచుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎంఎంటీఎస్ విస్తరణతో పాటు మెట్రో రెండవ దశ నిర్మాణం కోసం కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
కాగా.. కేటీఆర్ ఓపెన్ చేసిన శిల్పా లే ఔట్ ఫ్లైఓవర్తో ఓఆర్ఆర్కు చేరుకునే సమయం తగ్గనుంది. 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. దీని కారణంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ మరింత పెరగనుంది. అలాగే హెచ్కేసీ, మీనాక్షీ టవర్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఊపందుకునే అవకాశం వుంది.