మొయినాబాద్ ఫామ్‌హౌస్ వ్యవహారంపై చట్టం తన పని తాను చేసుకుని పోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న తాము ఏం మాట్లాడిన దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని ఆరోపించే అవకాశం ఉందన్నారు.

మొయినాబాద్ ఫామ్‌హౌస్ వ్యవహారంపై చట్టం తన పని తాను చేసుకుని పోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న తాము ఏం మాట్లాడిన దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని ఆరోపించే అవకాశం ఉందన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. మునుగోడు ఉప ఎన్నికలో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తాము 8 ఏళ్లలో చేసిన అభివృద్దిని చెబుతూ ఉప ఎన్నికలో ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. టీఆర్ఎస్ తరఫున, మునుగోడు ప్రజల తరఫున జూటా, జూమ్లా పార్టీ బీజేపీపై చార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేటీఆర్.. మొయినాబాద్ ఫామ్‌ హౌస్ ఘటనపై సందర్భానుసారంగా ముఖ్యమంత్రి కేసీఆర్, విచారణ చేపట్టిన అధికారులు, దర్యాప్తు సంస్థలు అన్ని వివరాలు ఇస్తాయని అన్నారు. ప్రజల ముందుకు అన్ని విషయాలు వచ్చాయని.. దొంగ ఎవరు?.. దొర ఎవరనేది తెలిసిపోయిందని చెప్పారు. 

బాధ్యత కలిగిన వ్యక్తులుగా.. ఈ విషయంలో తొందరపాటు వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నాయకులను కోరానని గుర్తుచేశారు. అలాంటిది తాను మాట్లాడిన కూడా తొందరపడి మాట్లాడినట్టు అవుతుందని చెప్పారు. ఈ అంశం కోర్టులో ఉన్నందున తానేమి మాట్లాడనని తెలిపారు. 

యాదాద్రిలో బండి సంజయ్ ప్రమాణం గురించి మీడియా ప్రశ్నించగా.. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారం అయితే ఇంకా కోర్టులు ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ నేతలు రేపిస్టులకే దండలు వేసి ఊరేగిస్తారని.. వాళ్లు చేసే ప్రమాణాలకు ఏం విలువ ఉంటుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో అక్కడ దేవుడిని తాకడం అంటే పాపమని అన్నారు. దయచేసి సంప్రోక్షణ ఏదైనా చేయాల్సి ఉంటే చేయాలని యాదాద్రి ఆలయ అధికారులను, వేద పండితులను కోరుతున్నట్టుగా చెప్పారు. గుజరాత్‌ వాళ్ల చెప్పులు మోసే కర్మ వాళ్లకు ఉండవచ్చు కానీ.. మళ్లీ వాళ్లొచ్చి దేవుడిని తాకితే దేవుడు కూడా అపవిత్రం అవుతాడని.. యదాద్రి లక్ష్మీనరసింహ స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సంప్రోక్షణ చేయాలని కోరారు.