ప్రజా సంక్షేమం కోసం రాహుల్, మోదీలను సైతం ఢీకొంటాం:కేటీఆర్
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పోరాటానికి ఎంతో ప్రాధాన్యత ఉందని మంత్రి కేటీఆర్ కొనియాడారు. అంబర్ పేటలోని న్యాయవాదుల సదస్సులో పాల్గొన్న కేటీఆర్ న్యాయవాదులు తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశారన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పోరాటానికి ఎంతో ప్రాధాన్యత ఉందని మంత్రి కేటీఆర్ కొనియాడారు. అంబర్ పేటలోని న్యాయవాదుల సదస్సులో పాల్గొన్న కేటీఆర్ న్యాయవాదులు తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశారన్నారు.
న్యాయవాదులు సంక్షేమాన్ని న్యాయవాదుల కుటుంబాల సంక్షేమాన్ని కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
కాంగ్రెస్ జాతీయ నేత జైరాం రమేష్ కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ పార్టీపైనా చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతపై చర్చిస్తున్న తరుణంలో తమపైనా తమ పార్టీపైనా కించపరిచేలా మాట్లాడారన్నారు. టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేస్తామని చెప్పారని అందుకు కేసీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోయినా, ఉద్యమాన్ని అణిచివెయ్యాలని చూసినా కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకలించి వేస్తారని వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు అదే చేశారని తెలిపారు.
తెలంగాణలో కార్యదక్షకుడిలా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అంటూ కేటీఆర్ కొనియాడారు. ప్రజల కోసం అవసరమైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీనైనా, ప్రధాని నరేంద్రమోదీనైనా ఎదురిస్తారని చెప్పుకొచ్చారు.
హైకోర్టు విభజన కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో అలుపెరగని పోరాటం చేశారని కేటీఆర్ స్పష్టం చేశారు. హైకోర్టును 3నెలల్లో విభజిస్తామని చెప్పిన న్యాయశాఖ మంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో హైకోర్టు విభజనకు మోకాలడ్డారని తెలిపారు.