కమ్యూనిస్టుల వల్లే మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు.. భవిష్యత్తులోనూ వామపక్షాలతోనే : మంత్రి జగదీశ్ రెడ్డి
కమ్యూనిస్టుల మద్ధతు వల్లే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. భవిష్యత్తులోనూ కమ్యూనిస్టులతో కలిసే ముందుకు సాగుతామన్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో తీవ్ర ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదివేలకు పైగా ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఈ గెలుపులో వామపక్షాల వాటా కీలకం. ఈ క్రమంలోనే మంగళవారం హైదరాబాద్లోని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యాలయాలకు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల వెళ్లారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు కూనంనేని సాంబశివరావు, చాటా వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డిలతో వారు భేటీ అయి... టీఆర్ఎస్ విజయానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల మద్ధతుతోనే టీఆర్ఎస్ మునుగోడులో గెలిచిందన్నారు. భవిష్యత్తులోనూ కమ్యూనిస్టులతో కలిసే ముందుకు సాగుతామన్నారు. మునుగోడులో బీజేపీ విజయాన్ని అడ్డుకోవడం ద్వారా తెలంగాణను పెద్ద విపత్తు నుంచి కాపాడుకున్నామని కూనంనేని అన్నారు.
అంతకుముందు సోమవారం సీఎం కేసీఆర్ ను మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కేసీఆర్ అభినందించారు. శాలువా కప్పి సన్మానించారు. మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన సూచించారు.ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని కేసీఆర్ సూచించారు. విజయం కోసం పనిచేసిన పార్టీ నేతలను, కార్యకర్తలను సీఎం అభినందించారు.
ALso REad:మునుగోడులో ఓటమిపై బీజేపీ పోస్టుమార్టం: కేంద్ర నాయకత్వానికి నివేదికను పంపనున్ననేతలు
ఇకపోతే.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ 86 యూనిట్లుగా విభజించింది. ఒక్కో నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,ఎంపీ,మంత్రి,కీలక నేతలను ఇంచార్జీగా నియమించింది.మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ ,బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఈ రెండు పార్టీలు తమ సర్వశక్తులు ఒడ్డాయి. కానీఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.
ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి నవంబర్ 3న ఉపఎన్నిక జరిగింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగి ఓటమి పాలయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.