తెలంగాణ పాలిట శనిలా తయారయ్యాడు: చంద్రబాబుపై హరీష్ ధ్వజం
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రాకు ప్రత్యేక హోదా తెలంగాణకు మెుండి చెయ్యి తప్పదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రాకు ప్రత్యేక హోదా తెలంగాణకు మెుండి చెయ్యి తప్పదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఒక్క టీఆర్ఎస్ పార్టీ వల్లే సాధ్యమని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తుంటే తెలుగుదేశం, కాంగ్రెస్, టీజేఎస్ పార్టీలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ప్రతీ ఇంటికి నల్లా రావాలన్నా ప్రతీ ఎకరాకు నీరందాలన్నా టీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కాంగ్రెస్, టీడీపీలపై హరీశ్ రావు విమర్శల దాడి చేశారు. తెలంగాణను అడ్డుకున్న తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుపెట్టుకుంటుందని మండిపడ్డారు. చివరి నిమిం వరకు తెలంగాణను అడ్డుకున్న ఏకైక పార్టీ టీడీపీ అలాంటి పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుపెట్టుకుని తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడుతో జతకడతారా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు అని, అనుమతులు ఇవ్వొద్దని చంద్రబాబు లేఖలు రాశారని గుర్తు చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు, ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని ఢిల్లీలో అడ్డంపడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు.
రాష్ట్రవిభజన సమయంలో తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు నాయుడు విడిపోయిన తర్వాత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయినా శనిలా చంద్రబాబు నాయుడు తమను వెంటాడుతున్నాడని దుయ్యబుట్టారు. తెలంగాణకు అడ్డంపడిన పార్టీకి ఓటేస్తారా అని ప్రశ్నించారు.
గతంలో పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటానన్న చంద్రబాబు నాయుడు ఏం చేశారో ప్రజలకు తెలుసునన్నారు. చంద్రబాబు పలకలు వేస్తే రాజశేఖర్ రెడ్డి మెుక్కలు నాటారే తప్ప పాలమూరు జిల్లాకు నీరిచ్చిన పాపాన పోలేదన్నారు.
అలాంటిది కేసీఆర్ హయాంలో మహబూబ్ నగర్ జిల్లాలో 8లక్షల ఎకరాలకు సాగునీరందించారన్నారు. అలాగే త్వరలో కొడంగల్ నియోజకవర్గానికి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ సైతం శతవిధాలా ప్రయత్నించారని హరీష్ ఆరోపించారు. రైతుల ఉసురు కోదండరామ్ కు తగలక తప్పదని హెచ్చరించారు.
ఈరోజు అభివృద్ధి నిరోధకులంతా ఒక్కటవుతున్నారని, అభివృద్ధి నిరోధకులు కావాలా....అభివృద్ధి సాధకులు కావాలో ప్రజలే తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.