కేంద్రం కాపీ క్యాట్.. బీజేపీ నేతలకు దమ్ముంటే ఆ పనిచేసి మాట్లాడండి.. హరీశ్ రావు సవాల్
ఇబ్రహీం పట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇబ్రహీంపట్నం నుండే ప్రారంభమైంది. 70 నుండి 80 శాతం ఓటింగ్ ఉండేలా చూడాలి’ అని పిలుపునిచ్చారు.
ఇబ్రహీం పట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇబ్రహీంపట్నం నుండే ప్రారంభమైంది. 70 నుండి 80 శాతం ఓటింగ్ ఉండేలా చూడాలి’ అని పిలుపునిచ్చారు.
అంతేకాదు ఓటింగ్ శాతం పెరిగితే మనదే విజయం అని చెప్పుకొచ్చారు. బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు లేని నెట్ వర్క్ మనకుంది. కష్టపడి పని చేస్తే గెలుపు ఖాయం అని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరును నేరుగా కలిసి తెరాసకు ఎందుకు ఓటు వేయాలో వివరించాలని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థులకు ఓటు వేస్తే వచ్చే లాభం ఏముంది?వారేమైనా అధికారంలో ఉన్నారా? అని ప్రశ్నించారు.
ఒకప్పుడు తెలంగాణ అంటే నిషేధం. అలాంటిది తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్, తెరాసది. ఎన్నికల కోసమే కాంగ్రెస్ తెలంగాణ పేరు వాడుకుంది. ఇక బీజేపీ వాళ్లు ఇన్నేళ్లు అధికారంలో ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఇంటింటికి తాగు నీరు ఇచ్చారా? 70 యేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కానీ తాగు నీరు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
కేంద్రం మన మిషన్ భగీరథను కాపీ కొట్టింది. రైతు బంధును కాపీ కొట్టి ఆరు వేల రూపాయలు ఇస్తోంది. ఓనాడు నీటి తీరువా, శిస్తులు ప్రభుత్వాలు వసూలు చేస్తే తెరాస వచ్చాక ఎకరానికి పది వేలు రైతు బందు ఇచ్చాం.
తెలంగాణా వచ్చే నాటికి విద్యుత్ ఉత్పత్తి 7778 మెగా వాట్లు కాగా, నేడు 16 వేల మెగావాట్లుకు చేరింది. తెలంగాణ లో తప్ప దేశంలో ఎక్కడయినా ఉచితవిద్యుత్ 24 గంటలు ఏ రాష్ట్రంలో అయినా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.
పేదింటి పెళ్లికి లక్షరూపాయలు ఇస్తున్నాం. ఇదేకాపీ కొట్టి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తోంది. బీజేపీ కి ఇవ్వాల్సినవి ఇవ్వడం చేతగాదని దుయ్యబట్టారు.
రేల్వే కోచ్ ఫ్యాక్టరీ, వెనుకబడిన ప్రాంతానికి 400 కోట్లు ఇస్తామని, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ ఇస్తామని హామీ ఇచ్చారు. దమ్ముంటే బీజేపీ నేతలు వీటిని తెచ్చి మాట్లాడండి అని సవాల్ విసిరారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశవృద్ది రేటు 8శాతం ఉంటే నేడు మైనస్ 8శాతానికి పడిపోయింది. అదే తెలంగాణ 14 శాతం వృద్ధి రేటు సాధించింది. తెలంగాణ కోసం రాజీనామాలంటే కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు.
ఇబ్రహీంపట్నం కు కృష్ణా నీరు తెస్తామని హామీ ఇచ్చారు. ప్రశ్నించే గొంతు అంటూ మోసం చేస్తున్నారు.. మేం పరిష్కారంచేసే వారం. పని చేసే చేతల మనుషులం అన్నారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్తి సురభి వాణి దేవి గురించి మాట్లాడుతూ... ఆమె పీవీ కుమార్తె మాత్రమే కాదు గొప్ప విద్యావేత్త, సేవా భావం కలిగిన వ్యక్తి, మన ఏకైక మహిళా అభ్యర్థి. ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.