కేసీఆర్ ప్రశ్నలకు జవాబేది.... అంతా ‘కల్లబొల్లి కబుర్లే’ : బీజేపీ సమావేశాలు, సభపై హరీశ్ రావు ట్వీట్
కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు బీజేపీ నేతలు సమాధానం చెప్పలేదన్నారు మంత్రి హరీశ్ రావు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశానికి, తెలంగాణకు సంబంధించి ఏం చెప్పలేదని ఆయన ఫైరయ్యారు.
హైదరాబాద్ వేదికగా జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాలు (bjp national executive meeting ) , సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ‘‘విజయ సంకల్ప సభ’’పై (Vijaya Sankalpa Sabha) టీఆర్ఎస్ అగ్రనేత (trs) , మంత్రి హరీశ్ రావు (harish rao) స్పందించారు . ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేసిన ఆయన.. ‘‘ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధానమేదైనా ప్రకటిస్తారని ఆశించాం. కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప విధానమే లేదని తేల్చేశారు. కేసీఆర్ గారు అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేదు సరికదా అసలు తమకు జవాబుదారీ తనమే లేదని నిరూపించారంటూ’’ హరీశ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇకపోతే.. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగిసింది. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ఏమాత్రం జవాబు ఇవ్వకుండా.. కనీసం రాజకీయ విమర్శల ఊసేత్తకుండా మోడీ ప్రసంగం సాగింది. దీంతో బీజేపీ శ్రేణులు నిరాశ చెందాయి. హైదరాబాద్ ప్రతిభకు పట్టం కడుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. తెలుగులో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీని ఆశీర్వదించేందుకు వచ్చిన వారందరికీ మోడీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని.. తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ అని ఆయన అన్నారు. తెలంగాణ గడ్డ ఎంతో స్పూర్తిని ఇస్తోందని.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని మోడీ చెప్పారు. బడుగు , బలహీన వర్గాల కోసం బీజేపీ ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు.
భద్రాచలం రాముల వారి ఆశీస్సులు మనకు వున్నాయని ప్రధాని తెలిపారు. తెలంగాణలో ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాలకు కేంద్ర పథకాలు అందుతున్నాయని మోడీ చెప్పారు. ఉచిత రేషన్ , ఉచిత వ్యాక్సిన్ అందించామని.. హైదరాబాద్ అన్ని రంగాల వారికి అండగా నిలుస్తోందన్నారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. మంత్రంతో తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు. ఎనిమిదేళ్లుగా దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రయత్నించామని మోడీ తెలిపారు.
2019 ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్ధతు పలికారని.. 2019 నుంచి తెలంగాణలో పార్టీ బలపడుతోందని ప్రధాని అన్నారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజల కోసం చాలా చేశామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోందని.. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని మోడీ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరిందని ఆయన గుర్తుచేశారు. దళితులు, ఆదివాసీలు,పేదల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చిందన్నారు.