బీజేపీలో చేరితే ఆత్మహత్యేనని.. ఆ పార్టీలోకి ఎవరు వెళ్లినా రాజకీయాలకు దూరమైనట్లేనని అన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు . తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చే పరిస్ధితి లేదని హరీశ్ రావు జోస్యం చెప్పారు.
తెలంగాణ ఆర్ధిక మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే ఆత్మహత్యేనని.. ఆ పార్టీలోకి ఎవరు వెళ్లినా రాజకీయాలకు దూరమైనట్లేనని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చే పరిస్ధితి లేదని హరీశ్ రావు జోస్యం చెప్పారు. అంతకముందు తెలంగాణ ప్రజలకు మంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగంలో వృద్ధి చెందిందన్నారు.
Also Read: సీఎం కేసీఆర్ అసలుసిసలైన రైతు బాంధవుడు..: ఆర్థిక మంత్రి హరీష్
ఇకపోతే.. రైతు సంక్షేమం కోసం అనుక్షణం పరితపించే ముఖ్యమంత్రి కేసీఆర్ అసలైన రైతు బాంధవుడని మంత్రి హరీష్ రావు కొనియాడారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు భీమా, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు... ఇలా రైతులకు కేసీఆర్ సర్కార్ అండగా నిలుస్తోందన్నారు. రైతు బంధు ద్వారా 65 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన రైతు పక్షపాతి మన సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగుల, ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరీ రైతులకు రైతుబంధు వేశామన్నారు. అలాగే ఇప్పటివరకు 98 వేల మంది రైతుల కుటుంబాలకు రైతు భీమా ద్వారా ఐదు లక్షల చొప్పున ఇచ్చామని హరీష్ తెలిపారు
