కొడంగల్లోనే రేవంత్ను ఓడించా.. ఇది నా గడ్డ: హరీశ్ వ్యాఖ్యలు
బీజేపీ వాళ్లు వందకార్లతో ఊళ్లోకి వస్తుంటే వందమంది కూడా లేరని ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్ రావు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతూ.. పరాయి నాయకులు, కిరాయి మనుషులే బీజేపీ వాళ్లకు దిక్కని ఆరోపించారు.
రుణమాఫీ చెక్కులను కేసీఆర్ నేరుగా రైతులకే ఇస్తారని మంత్రి చెప్పారు. రేవంత్ రెడ్డికి కొడంగల్కు వెళ్లి ఓడించానని .. ఇది నా సొంత గడ్డని, ఎవరొచ్చి ఏం చేస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు.
అంతకుముందు తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదన్న సీఎం కేసీఆర్ విమర్శలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటరిచ్చారు. టీఆర్ఎస్ నేతలు పంచుతున్న ఓట్ల డబ్బులు ఎవరివని ఆయన ప్రశ్నించారు.
నిధుల లెక్కలపై కేసీఆర్ చెబుతున్నవన్ని అబద్ధాలేనని.. కేంద్రం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే దుబ్బాక చౌరస్తాలో ఉరివేసుకుంటానని సవాల్ చేశారు సంజయ్. దుబ్బాకలో కేసీఆర్కు గెలవాలని లేదన్నారు.
దుబ్బాకలో టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచుతోందని ఆరోపించారు బండి సంజయ్. టీఆర్ఎస్ పంచే డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటేయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బీజేపీకి ఓటు వేసి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ ఓడిపోతే హరీశ్ రావు అడ్డు తొలిగిపోతోందని కేసీఆర్ భావిస్తున్నారని.. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయిన తెల్లారి కొడుకును సీఎం చేస్తాడని సంజయ్ వ్యాఖ్యానించారు.